పెద్దపల్లి, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చానెళ్లలో వార్తలను ప్రసారం చేయడం సరికాదని సూచించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని తేల్చితెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి ఓ న్యూస్ చానల్లో పుట్ట మధు బీజేపీలో చేరుతున్నట్లు వార్త ప్రసామవుతుండడంపై ఆయన స్పందించారు. ఢిల్లీలోనే విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తనకు సీఎం కేసీఆర్ పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించారన్నారు. పార్టీలో తనకు మంచి గుర్తింపు, సముచి తం స్థానం ఉందన్నారు. తనపై బు రద జల్లుతూ ఇ లాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు.
సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఆధారాలు లేని పోస్టింగ్లు పెడితే వాటిని నమ్మి ప్రముఖ టీవీ చానళ్లు ఇలా వార్తలను ప్రసారం చేయడం సరికాదన్నారు. వాస్తవాలను గ్రహించి టీవీలు, పేపర్లు వార్తలు రాయాలన్నా రు. తనకు పార్టీలో, ప్రజల్లో రాజకీయంగా చెడ్డ పేరు తీసుకు వచ్చేందుకే ఇలా కొన్ని న్యూస్ చానెళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. గతంలో మంథనిలోని అంబేద్కర్ సాక్షిగా ఇలాంటి తీరుపైనే తాను మీడియాను ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల నుంచి, అత్యంత కింది స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తనపై ఎందుకు ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడనని పునరుద్ఘాటించారు.