జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 9 : కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో ముస్లింల అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వంద శాతం సెక్యులర్ పార్టీ అని, కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు రక్షణగా ఉంటున్నదని స్పష్టం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమార్ జలీల్లతో కలిసి 400 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనా విధానం మేరకు రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని క్రిస్టియన్, మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో అందరూ సమానంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి సంక్షేమ పథకం అమలులో కరుణ, దయ, మానవత్వం ఉంటుందని, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వారే ఇలాంటి సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్లతో 25 వేల కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీల కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని, మతాలు వేరైనా ఎవరి మత విధానాలు వారివేనన్నారు. ముస్లిం నిరుపేద యువతులకు షాదీముబాక్, విద్యార్థులకు మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఒకేసారి 204 రెసిడెన్షియన్ పాఠశాలలు ప్రారంభించామని చెప్పారు.
ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. మైనార్టీల ఆర్థిక సాయం కోసం రూ.400కోట్ల కేటాయించడం మానవీయ కోణానికి నిదర్శనమన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా జరపడానికి నియోజకవర్గం, జిల్లా స్థాయిలో బట్టల పంపిణీ, ఇఫ్తార్ దావత్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని కబరస్తాన్, ఈద్గా, మసీదులు, షాదీఖానాల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు అందజేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.10,670 కోట్లు కేటాయించిందని, ఈ వార్షిక సంవత్సరం రూ.2700కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ, క్రిస్టియన్, ఫైనాన్స్ ఎండీ వెస్లీ, డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, దివాకర, మున్సీపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు చీటి వెంకట్రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సాయిబాబా, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ పాల్గొన్నారు.
మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నది. పేదరికాన్ని నిర్మూలించడానికి నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాలను ప్రారంభించిన, మైనార్టీలకు రుణాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. నిరుపేద ముస్లిం తల్లిదండ్రులకు బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం షాదీముబారక్ పథకం కింద రూ.లక్ష ఇస్తూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. మైనార్టీ గురుకులాల్లో చదివిన ఆటో డ్రైవర్ల పిల్లలు ప్రస్తుతం డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడుతున్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్. సెక్యులర్ పార్టీ అంటే బీఆర్ఎస్. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలంతా కలిసి బీఆర్ఎస్కు ఓటువేద్దాం. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను నిలుపుదాం. ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంలో కృషి చేసి సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు.
– మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్
ముస్లిం నిరుపేదలకు విద్యను అందించడానికి కేసీఆర్ కృషి చేశారు. ఇందులో భాగంగానే మైనార్టీ కళాశాలల ఏర్పాటు. చదువు గొప్ప ఆయుధం. మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే. సేవా తత్వం గల నాయకుడు సీఎం కేసీఆర్. కుట్టు మిషన్లతో మహిళలలకు ఉపాధి లభిస్తుంది. అభివృద్ది సంక్షేమంలో రోల్మాడల్గా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. అణగారిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యం. దళితులు, మైనార్టీల గురించి ఆలోచించిన వ్యక్తి సీఎం కేసీఆర్.
-దావ వసంత, జడ్పీ చైర్పర్సన్ ( జగిత్యాల)
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ మహిళా సాధికారత సాధించడానికి ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం జగిత్యాలలో ఏర్పాటు చేసినందుకు మంత్రి కొప్పులకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గంగా జమున తహజీబ్లా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నది. నిరుపేదల కోసం జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా, టీఆర్నగర్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. నియోజవకర్గంలో 400 కుట్టు మిషన్లను మహిళలకు అందజేయడం అభినందనీయం.
-జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ముస్లిం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపా. మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం, నియోజకవర్గంలో 2 నుంచి 3 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మసీదుకు కూడా ప్రభుత్వ పక్షాన రంగులు వేయలేదు. అసెంబ్లీలోని బురుజులను బీజేపీ నాయకులు పగుల గొడతామని అనడం సరికాదు. ముస్లింల విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర మరువలేనిది.
-కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
గతంలో ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను ఒకే రకంగా చూస్తున్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేయడం వల్ల నిరుపేద ముస్లిం విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నారు. విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయిస్తున్నది. ఇమామ్, మౌజ్లకు జీతాలు అందిస్తున్నాం. మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. హజ్ యాత్ర కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లించింది. ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు మైనార్టీలు గుర్తుకువస్తాయి. ముస్లింల విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.
-చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్