Korukanti Chander | పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 27 : గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సోమవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగున్న కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే ధ్యేయంగా కేసీఆర్ తన పార్టీని స్థాపించారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం లో గులాబీ జెండా ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్మిన కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలి అని కొనియాడారు. బీఆర్ఎస్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టిందని దుయ్యబట్టారు.
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ కార్పొరేటర్ నారాయణ దాస్ మారుతి, బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కొయ్యడ సతీష్, నాయకులు పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, ఆకుల స్వామి వివేక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.