కార్పొరేషన్, ఫిబ్రవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ను అద్భుతంగా మారుస్తామని, రా ష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నగర అభివృద్ధి పనులపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణచౌ క్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద అభివృద్ధి ప నుల కోసం రోడ్లు తవ్వి వదిలేయడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని, లేదంటే టెండర్ రద్దు చేసి ఇతరులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో 13 చౌరస్తాల్లో ఐలాండ్స్ అభివృద్ధి ప నులను వెంటనే ప్రారంభించి, మార్చి 31లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి వేగంగా సాగుతున్నదని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దగలుగుతున్నామని పేర్కొన్నారు. గతంలో నగరంలో అన్నీ 40ఫీట్ల రోడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డామని, ఈ క్రమంలో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ సహకారంతో 40ఫీట్ల రోడ్లను 100 ఫీట్లకు విస్తరించినట్లు చెప్పారు. ఆ మేరకు కరీంనగర్ అభివృద్ధిపై స్మితా సబర్వాల్కు వివరించి నగరంలో పర్యటించాలని ఆహ్వానించామని, 16 న ఆమె కరీంనగర్లో పర్యటించి మానేర్ రివర్ ఫ్రంట్, కేసీఆర్ రెస్ట్ హౌస్, కేబుల్ బ్రిడ్జి, రోడ్లను పరిశీలించనున్నారని తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధికి ఎవరు కృషి చేసినా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామన్నారు. నగరంలో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి తీ సుకెళ్లగా, ప్రత్యేక ఫండ్ కింద రూ.20కోట్లు ఇచ్చారని వెల్లడించారు. వీటిల్లో రూ.10కోట్లు కరీంనగర్ రూరల్కు,రూ.10కోట్లు నగరానికి కేటాయించినట్లు చెప్పారు. రూ.10కోట్లలో రూ.కోటి నిధులను అంబేదర్ కమ్యూనిటీ హాల్, రూ.2కోట్లు షాదీఖానకు కేటాయిస్తున్నామన్నారు. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో 80శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్, మేయర్ యాదగిరి సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్ ఉన్నారు.