ఫర్టిలైజర్సిటీ, మార్చి 13: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని, ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నదని చెప్పారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో సింగరేణి నిధులు 142 కోట్ల వ్యయంతో అదనపు 355 పడకల దవాఖాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాగూర్, కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామని, జిల్లాలో దాదాపు 2వేల మంది స్కీంను వినియోగించుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఓసీపీలో స్థానిక యువతకు 80శాతం మేర ఉపాధి కల్పించాలని సింగరేణి సంస్థను కోరినట్లు వివరించారు. అలాగే ఆర్ఎఫ్సీఏల ఎన్టీపీసీ సంస్థలు కూడా స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించేందుకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక్కడ మేయర్ డాక్టర్ అనిల్కుమార్, రామగుండం సీపీ శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, సింగరేణి ఆర్జీ-1 జీఎం శ్రీనివాస్ ఉన్నారు.