Peddapally | అంతర్గాం : ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటాలని సూచించారు.
అలాగే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల ఓపికగా, మర్యాదగా ప్రవర్తించి వారిలో ధైర్యం నింపాలన్నారు. పోలీసులంటే ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే మండలంలో అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడంతోపాటు వరుసగా నేరాలకు పాల్పడుతున్న వారిపై అవసరమైతే షీట్లు ఓపెన్ చేయాలన్నారు.
నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. మండలంలో నేరాలను తగ్గించే విధంగా తీసుకుంటున్న చర్యల పట్ల ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది ఉన్నారు.