కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 16 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దేశంలో రెండు పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేంద్రం యాసంగి పంట సేకరణకు మందుకురాకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మేలు తలంచి వడ్ల కొనుగోలుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఆయన సూచనల మేరకు దిగుబడి ప్రారంభమయ్యే 15 రోజుల మందుగానే కొనుగోళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7100 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 400 సెంటర్లు తెరిచి రూ. 4.15 కోట్ల విలువైన రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. ఆదివారం ఆయన కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.
అంతేకానీ దళారులను నమ్మి నట్టేట మునుగవద్దని చెప్పారు. ఎండకాలం నేపథ్యంలో సెంటర్లలో తాగునీరు, నీడ ఇతర సౌకర్యాలను కల్పించామన్నారు. అలాగే కొన్న వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అసవరం మేరకు రవాణా సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి గింజనూ కొనే బాధ్యత సర్కారుదేనని స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నాయకులు సెంటర్లను సందర్శించి రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తారని ఆరోపించారు. సెంటర్లకు వచ్చిన నాయకులను వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో రెండు పంటలను ఎందుకు కొనుగోలు చేయడంలేదో నిలదీయాలని రైతులకు సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేదని, రైతులు తీసుకువచ్చిన ధాన్యం నూక కాకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి పాలనలో సాగునీరు లేక సగం మేరకు భూములు పడావుగా పెట్టాల్సి వచ్చేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని చెప్పారు. సర్కారు అనుసరిస్తున్న సాగు అనుకూల విధానాలతో భూమికి బరువయ్యే పంట పండుతుందన్నారు.
ధాన్యం బస్తాను 40. 600 కిలోలకు తూకం వేయాలని సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. తరుగు పేరిట రైతులకు నష్టం చేయవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్, దుర్శేడ్ సింగిల్ విండోల చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, గోనే నర్సయ్య, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డ వేణి మధు, జడ్పీటీసీ పురుమల్ల లలిత, సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దామరపల్లి పుష్ప, డీఏవో శ్రీధర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్, శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఉప సర్పంచ్ శేఖర్, ముత్యం శంకర్ గౌడ్, కుక్కట్ల తిరుపతి, పంది తిరుపతి యాదవ్, మహ్మద్, కందుల రమేశ్గౌడ్, కూర శ్యాంసుందర్రెడ్డి, చింతల లక్ష్మణ్, కరీంనగర్ సింగిల్ విండో సీఈవో రమేశ్, గంట శంకరయ్య, జక్కం నర్సయ్య, నాగయ్య, సంపత్, అంజిరెడ్డి,దాడి లక్ష్మయ్య, దాడి లక్ష్మన్. మంద తిరుపతి, మల్లారెడ్డి పాల్గొన్నారు.