Vemulawada | వేములవాడ, మే 4 : వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల యజమానులు వారి వద్ద బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు తామే ఆభరణాలు కూడా తక్కువ ధరకు తయారు చేసి ఇస్తామంటూ తమ ఉపాధిపై పొట్ట కొడుతున్నారని వాపోయారు.
బంగారం విక్రయించే వరకు బాగానే ఉన్నా తమ పనిని కూడా వారే తీసుకొని మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వారి వైఖరి మార్చుకోకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేష్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేష్, రాజేష్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.