ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది. నాడు ఎస్సారెస్పీకి వరద వచ్చిన సమయాల్లో కాలువను ఉపయోగించుకునేలా నాటి పాలకులు ప్లాన్ చేస్తే, నేడు అపర భగీరథుడి సంకల్ప బలంతో జలాశయాన్ని నింపుతున్నది.
చుక్క వాన లేదు.. ఎగువ నుంచి వచ్చే వరద అంతకన్నా లేదు.. కానీ, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మనోఫలకం నుంచి ఉద్భవించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ ఫలితం కండ్లముందు కనిపిస్తున్నది. దిగువకు పారే గోదావరి జలాలు.. ఎగువకు ఎదురెక్కుతూ నలుదిశలా పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, జలాశయాలను నింపేందుకు తరలివస్తున్నాయి. ఇప్పటికే గాయత్రీ పంప్హౌస్ నుంచి ఉప్పొంగుతూ, ఇటు ఎస్సారెస్పీకి.. అటు ఎస్సారార్కు పరుగులు తీశాయి. ఓవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడగా, మరోవైపు వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఉన్న రెండు గేట్లను ఎత్తడంతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్కు తరలాయి. అక్కడి నుంచి దిగువమానేరుకు, అదే సమయంలో అనంతగిరి జలాశయానికి చేరాయి. ఎటు చూసినా జల సవ్వడులు వినిపిస్తుండగా రైతులు సంబురంగా సాగు బాట పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కరీంనగర్, జూలై7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూలై7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ వానకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయనే నమ్మకంతో రైతులు భారీగా పంటలు వేశారు. పత్తి విత్తడంతోపాటు వరి నార్లు పోశారు. వాతావారణ శాఖ ముందుగా చెప్పిన దాని ప్రకారం.. మేలో రోహిణికార్తె నుంచి వర్షాలు ఆరంభమవుతాయని భావించారు. అలాగే జూన్, జూలైలో భారీగా వర్షపాతం నమోదవుతుందని ఆశించారు. కానీ, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదు. ప్రతికూల పరిస్థితులతో చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తలేదన్న వార్తలొస్తున్నాయి. అలాగే సరిపడా నీళ్లు లేక రైతులు నాట్లు వేసేందుకు సైతం మొగ్గు చూపడం లేదు. ఈ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న సీం కేసీఆర్, ఈ నెల 2న అధికారులతో సమావేశమై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా వాడుకోవాలని, ఇటు తాగు, అటు సాగు నీటికి ఏ సమస్య లేకుండా చూడాలని, తక్షణమే ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
ఎటుచూసినా జలధారలు
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, ఈ నెల 3వ తేదీ నుంచే కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను ప్రారంభించింది. గడిచిన ఐదు రోజులుగా ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా శ్రీరాంసాగర్వైపు జలాలను తరలిస్తున్నది. లక్ష్మీ బరాజ్ నుంచి మొదలుకొని ఎస్సారెస్పీ ప్రాజెక్టు దాకా ఏర్పాటు చేసిన పంపులన్నీ నిరంతరాయంగా నడుస్తుండగా, 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారింది. దాదాపు ఒకటిన్నర టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 102 కిలోమీటర్ మైలురాయి నుంచి ఎదురెక్కిన గోదావరి, శుక్రవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నది. ఓ వైపు ఎస్సారెస్పీకి ఎత్తిపోతలు కొనసాగుతుండగా, మరోవైపు శుక్రవారం నుంచి మూడువైపులా కాళేశ్వరం జలాలను అధికారులు విడుదల చేశారు. వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన హెడ్రెగ్యులేటరీ గేట్లలో రెండింటినీ ఉదయం కొంత మేరకు లేపి 10వేల క్యూసెక్కులను శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 17 టీఎంసీల మేర నిల్వ ఉండగా, నాలుగు గేట్లు ఎత్తి దిగువన ఉన్న దిగువ మానేరు జలాశయానికి 10వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ నీరు లోయర్మానేరు డ్యాం చేరుకున్నది. ప్రస్తుతం ఎల్ఎండీలో 7.536టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అలాగే మధ్యమానేరు నుంచి అనంతగిరి జలాశయానికి 3,200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. అక్కడ సర్జ్పూల్కు నీరు చేరుతుండగా, అక్కడి నుంచి నీటిని ఎత్తి రిజర్వాయర్లో పోస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అక్కడి నుంచి పైన ఉన్న రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇలా నలుదిశలా కాళేశ్వర జలధారలు పారుతుండగా, రైతులు సంబురపడుతున్నారు. ఎత్తిపోతలు ఇలాగే కొనసాగించి మొత్తం రైతాంగానికి ఈ సీజన్లో సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయవంతంగా ఎత్తిపోతలు
పెద్దపల్లి, జూలై 7(నమస్తే తెలంగాణ)/ధర్మారం/ రామడుగు/మల్యాల/ మెట్పల్లి రూరల్/బోయినపల్లి/ తిమ్మాపూర్రూరల్: కాళేశ్వరం లింక్-1, 2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కా ళేశ్వరం దిగువన లక్ష్మీ బరాజ్కు ప్రాణహిత నుంచి 19,870 క్యూసెకుల ఇన్ఫ్లో మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తున్నది. దీంతో అధికారులు అకడి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్లోని 7మోటర్లను నడిపిస్తూ 15,400 క్యూసెకుల నీటిని, అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడికి చేరిన నీటిని మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపు హౌస్లోని 6 మోటర్లను నడిపిస్తూ 17,580 క్యూసెకులు మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు.
ఇక్కడికి చేరిన నీటిని, అంతర్గాం మండలం గోలివాడ పార్వతీ పంపుహౌస్లోని నాలుగు మోటర్లను నడిపిస్తూ 10,440 క్యూసెకులు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్కు వెళ్తుండగా, అకడ రెండు మోటర్లను నడిపిస్తూ 6300 క్యూసెకులను రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్ తరలిస్తున్నారు. ఇక్కడ రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెకుల నీటిని 5.7 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు.