Rasamayi Balakishan | మానకొండూర్ రూరల్, మే 25: పగలనకా.. రాత్రనకా.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఓ వృద్ధురాలు అభిమానాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మానకొండూర్ మండ లం వెల్దిలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈక్రమంలో గ్రామంలో న్యాత తారవ్వ అనే వృద్ధురాలి మనుమరాలుకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కు ఇచ్చేందుకు బైక్పై వెళ్లిన ఎమ్మెల్యేను చూసిన ఆమె ఎదురుగా వచ్చింది.
‘బిడ్డా రసమయి.. మంచిగున్నవా..? ’అంటూ ఆప్యాయ్యంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికింది. దీంతో రసమయి ఆమె ఇంటి ముందు నేలపైనే కూర్చొని అవ్వతో కాసేపు ముచ్చటించారు. ‘మా లాంటి పేదోళ్లకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ఇచ్చి కేసీఆర్ సారు పెద్ద కొడుకు, నువ్వు సిన్న కొడుకులైండ్రు. పొయ్యి మీద టమాటా కూర ఉడుకుతాంది. కొంచెం బువ్వ తినిపో బిడ్డా’ అంటూ అవ్వ అన్న మాటలకు రసమయి చలించిపోయారు. ‘అవ్వా నీ ప్రేమ నా మీద ఎప్పుడూ ఇట్లనే ఉండాలే. మీ లాంటి ఎంతో మంది అవ్వలను సీఎం కేసీఆర్ సారు గుండెలో పెట్టుకొని సాదుకుంటండు. ఇగో సారూ నీ మనుమరాలు శ్వేత పెళ్లి కోసం కల్యాణలక్ష్మి చెకు పంపిండు’ అంటూ చెకుతో పాటు చీరను తారవ్వ కోడలు, మనవరాలుకు ఎమ్మెల్యే అందజేశారు.
ఇంటి కోసం రూ.3లక్షలు ఇస్తా..
ఎమ్మెల్యేతో మాట్లాడిన తారవ్వ చివరగా తన బాధ చెప్పుకున్నది. ‘నాకు కొడుకు లేడు బిడ్డా. నాకు ఇల్లు కావాలని అడగ్గానే..’, ‘అవ్వా నీకు రూ.3 లక్షలు అందిస్త. మొదట నీకు ఇచ్చిన తర్వాతనే మిగిలినోళ్లకు ఇస్త’ అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ‘నీ మనువరాళ్లను సైతం మంచిగా చదివించు. అందుకయ్యే ఖర్చు ఏమన్నా ఉంటే నేను సాయం చేస్త్త’అని హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే వెంట మాజీ వైస్ ఎంపీపీ నూతి శ్రీనివాస్, నాయకులు రుద్రారం సాయికుమార్, రుద్రారం ప్రభాకర్, వీరేశం ఉన్నారు.