Godavarikhani | కోల్ సిటీ, జూలై 17 : రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, గోలివాడ చంద్రకళ, ఐత శివకుమార్ మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.150 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి నిర్మాణంకు స్థల సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. దీనితో అసంఘటిత రంగ కార్మికులు వైద్య సేవలకు నోచుకోవడం లేదన్నారు. వివిధ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో గల వేలాది మంది అసంఘటిత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమార్థం త్వరితగతిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని కోరారు.
2018 జనవరి 31 లోపు డీపీఆర్ తయారు చేసి నిర్మాణం చేయకపోతే నిధులు వెనక్కి పోతాయని స్పష్టం చేశారు. రీజనల్ కమిషనర్ స్పందించి వెంటనే నిర్మాణంకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వందల సంఖ్యలో యువతీ, యువకులు, కార్మికులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో లంక సురేష్, టీ. రమేష్ కుమార్, లెనిన్, ఎంఏ. గౌస్, కంకటి రవి గౌడ్, ఇందారపు సునీత, గాదం సరిత, లక్ష్మీ, కొండు రమాదేవి, సుశీల, జనగామ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.