కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 3 : కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ రెండేళ్లలో చేసింది ఏం ఉందని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం రేకుర్తిలోని 20వ డివిజన్, 28వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రులు, నాయకుల మధ్య కొట్లాటలు కావడం తథ్యమని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తులం బంగారం ఇస్తామని చెప్పేసరికి మహిళలు ఆశపడి కాంగ్రెస్కు ఓట్లు వేశారని, మోసపోయినట్లు ఇప్పుడు గుర్తిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చామన్నారు. ఎంపీగా ఏడేళ్ల కాలంలో బండి సంజయ్ ఏడు రూపాయలకు కూడా తీసుకుని రాలేదని విమర్శించారు. కేంద్రంతో కొట్లాడి తామే నిధులు తెచ్చాం.. మరి బండి సంజయ్ ఏం తెచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, 28వ డివిజన్ అభ్యర్థి కుర్ర తిరుపతి, 20వ డివిజన్ ఎదుర్ల రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ తదితరులు పాల్గొన్నారు.