ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పల్లెలు తిరగబడుతున్నాయి. కాంగెస్ పాలనలో అన్నదాతను గోస పెట్టి, ఇప్పుడు నోటికాడి బుక్కను ఎత్తగొట్టేలా కుట్రలు చేయడంపై మండిపడుతున్నాయి. రేవంత్గానీ, ఆ పార్టీ నాయకులు గానీ తమ ఊళ్లోకి రావద్దంటూ ఆయా గ్రామాల రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కాదని వస్తే తరిమి కొడతామంటూ హెచ్చరిస్తున్నారు. నిరంతర విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని స్పష్టం చేస్తున్నారు.
– కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ)/కొత్తపల్లి/ కరీంనగర్రూరల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు అంటుకుంటున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదని స్పష్టం చేస్తూ రైతులు గ్రామాల్లో ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ఆ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ప్లెక్సీ బోర్డులు వెలిశాయి. రైతులే స్వయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు మా గ్రామాల్లోకి రావద్దని స్పష్టం చేస్తున్నారు.
ఈ ప్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్, కమాన్పూర్, ఎలగందుల గ్రామాల్లో, ఇటు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, చెర్లభూత్కూర్, దుర్శేడ్, గోపాల్పూర్, తదితర గ్రామాల్లో కూడా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల వ్యతిరేక పార్టీ అని గతంలో కరెంట్ కావాలన్నందుకు రైతులను చంపించిందని రైతులు మండి పడుతున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే గతం పునరావృతం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుని తమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ప్రవేశం లేదని ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నామని రైతులు స్పష్టం చేస్తున్నారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్లో అంటుకున్న రేవంత్ వ్యతిరేక ప్లెక్సీల మంట రాను రాను అంతటికీ వ్యాపించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.