వేములవాడ రూరల్, ఆగస్టు 3: జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చి, తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని 23 ఏండ్లకు పట్టుబడ్డడు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లెకు చెందిన సంద్రగిరి లింగయ్య తన భార్యను హత్య చేసిన కేసులో కొన్నేండ్ల క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జీవిత ఖైదు పడగా, 2000 సంవత్సరంలో ఓ కారణంతో పెరోల్ మీద జైలు నుంచి బయటికి వచ్చాడు. అయితే తిరిగి జైలుకు వెళ్లకుండా త ప్పించుకు తిరుగుతున్నాడు. ముంబై, తదితర ప్రాంతాల్లో పనిచేసుకుంటూ బతికాడు. అప్పటి నుంచి పోలీసులు ఎంత గాలించినా అతని ఆచూకీ దొరకలేదు.
ఈక్రమంలో కొత్తగా జిల్లా కు వచ్చిన ఎస్పీ మహాజన్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో అధునాతన సాంకేతికతను ఆధారంగా చేసుకోని సిబ్బంది గాలించారు. ఈ క్ర మంలో ఎల్లారెడ్డిపేట మండలంలో లింగయ్య ను ఏఎస్ఐ లాక్పతి, సిబ్బంది సంపత్, శ్రీనివా స్, ఎల్లాగౌడ్, అంజయ్య పట్టుకున్నట్లు వెల్లడించారు. లింగయ్యను వరంగల్ జైలుకు తరలించామని చెప్పారు. ఖైదీని పట్టుకోవడానికి కృషి చేసిన డీఎస్పీ, సీఐతోపాటు ఏఎస్ఐ, కానిస్టేబుళ్లను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.