ఓవర్లోడ్ వాహనాలకు కళ్లెం వేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు బుధవారం నుంచి ఆకస్మికంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఓవర్లోడ్ వాహనాలు దొరికితే సీజ్చేసి భారీ జరిమానా విధించడమే కాకుండా.. సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. ప్రధానంగా ఈమధ్య పెట్రేగిపోతున్న ఇసుక వాహనాల అధిక లోడ్పై చర్యలు తీసుకునే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రవాణా శాఖాధికారుల పేరిట ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే.. తమ దృష్టికి తేవాలని, అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు.
కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధిక లోడ్తో వెళ్లే వాహనాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. నేటి నుంచి ప్రత్యేక బృందాల ద్వారా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ గ్రానైట్ వాహనాలు అధిక లోడ్తో వెళ్లేవి. వాటిని ఆకస్మిక తనిఖీల్లో పట్టుకొని రవాణా శాఖాధికారులు జరిమానా వేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఇసుక దందా జోరుగా నడుస్తోంది. మానేరు పరీవాహక ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. అయితే, చాలా మంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి ఓవర్లోడ్ తీసుకెళ్తున్నారు. ఫలితంగా రూ.వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వం వేసిన రోడ్లు దెబ్బతింటున్నాయి. ఇసుక క్వారీల నుంచి మెయిన్ రోడ్డు వరకు గ్రామీణ ప్రాంతాల్లో వేసిన రోడ్లు అధిక లోడ్కు చిత్తడవుతున్నాయి. అలాగే, ప్రధాన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.
కళ్లెం వేసేందుకు చర్యలు
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులు.. ఇక నుంచి ఓవర్లోడ్ వాహనాలకు కళ్లెం వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఆకస్మికంగా తనిఖీలు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా లోడ్ ఉంటే.. తక్షణమే సదరు వాహనాలను సీజ్ చేయనున్నారు. భారీగా జరిమానా విధించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా.. సంబంధిత వాహన యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. అలాగే, గ్రానైట్ క్వారీలకు సంబంధించి ఓవర్లోడ్ ఉంటే.. వాహనం సీజ్తోపాటు.. సంబంధిత క్వారీ యజమాలను నోటీసు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎదురు తిరిగితే చట్టరమైన చర్యలు
ఓవర్లోడ్ వాహనాలను అధికారులు పట్టుకుంటే.. ఈ మధ్య కాలంలో ఎదురు తిరగడం.. రచ్చచేసి వారి వాహనాలను విడిపించుకొని పోవడం కొందరికి అలవాటుగా మారింది. అంతేకాదు.. ఒక్క వాహనం పట్టుకోగానే.. మిగిలిన వాహనదారులకు సమాచారం చేరవేసి.. సదరు వాహనాలు రోడ్డుపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారులు వెళ్లిపోగానే తిరిగి యధావిధిగా వారి వ్యవహారం నడుపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖాధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటూ.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని.. ఓవర్లోడ్కు కళ్లెం వేయడమేకాకుండా.. ఎదురు తిరిగిన వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్లకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఓవర్ లోడ్ వాహనాలపై కఠిన చర్యలు
వాహనాలు ఓవర్లోడ్తో పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని డీటీసీ మామిండ్ల చంద్ర శేఖర్గౌడ్ తెలిపారు. సంబంధిత క్వారీ ప్రతినిధులు సైతం వాహన పరిమితి లోడ్కు మించి వేయరాదని లేని పక్షంలో వారికి కూడా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారుల పేరిట ఎవరైనా డబ్బు వసూలు చేస్తే dto_ karimnagar@tstran sport.in మెయిల్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొంద రు ప్రైవేట్ వ్యక్తులు లారీ యజమానుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ విషయంపై సమగ్ర విచారణ చేస్తున్నామని, విచారణలో నిజమని తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-కరీంనగర్ డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్