బోయినపల్లి, డిసెంబర్ 18: ‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం. ఈ ప్రాంత ప్రజల అదృష్టం’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, బీసీఎం దవాఖాన వ్యవస్థాపకుడు డా.వైరాగ్యం రాజలింగంతో ఇప్పటికే కంటి ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే, ఆదివారం కొదురుపాక బీసీఎం కంటి దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నేడు కంటి దవాఖాన మొదటి వార్షికోత్సవం అని తెలియగానే ఎమ్మెల్యే రవిశంకర్, వెంటనే కేకు, పూల దండ, శాలువా తెప్పించారు.
బీసీఎం కంటి దవాఖాన వ్యవస్థాపకులైన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డా.వైరాగ్యం రాజలింగం, డా రీటా బహదుర్ షా దంపతులను సన్మానించి, స్వీటు తినిపించారు. కంటి వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఈ క్రమంలో గ్రామాల్లో ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారన్నారు. వారి కోసం మారుమూల గ్రామమైన కొదురుపాకలో కార్పొరేట్ కంటి దవాఖాన ప్రారంభించి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు. బీసీఎం దవాఖాన కంటి వైద్య సేవలను పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దవాఖానకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.