విద్యానగర్, నవంబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన 12 ఐసీయూ పడకల గదిని కలెక్టర్ ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ ఐసీయూ పడకలు, తదితర సామగ్రి కోసం సుమారు రూ. 30 లక్షలు విరాళంగా ఇవ్వగా, నిర్మాణ్ ఎన్జీవో సంస్థ పరికరాలను కొనుగోలు చేసి అమర్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ లారస్ ల్యాబ్స్, నిర్మాణ్ ఎన్జీవో సంస్థ సేవలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొవిడ్ బారినపడిన రోగులకు జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందించిన సేవలతో ఎంతో మంది కోలుకున్నారని, దీంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ రోగులకు వైద్యులు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. లారస్ ల్యాబ్స్ అందించిన విరాళంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసీయూ పడకలను కొవిడ్ బాధితులే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఐసీయూ పడకలతోపాటు, 25 ఆక్సిజన్ సిలిండర్లు, రెండు వెంటిలేటర్లు తదితర సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్ఎంవో చంద్రశేఖర్, లారస్ ల్యాబ్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు సీహెచ్ సీతారామయ్య, ఏజీఎం పవన్ కుమార్, నిర్మాణ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు గోపి, వైద్యులు పద్మ, నవీన, సాయిని నరేందర్, వసీం, అలీం, నర్సింగ్ సూపరింటెండెంట్లు అంజమ్మ, సరళ, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్టులు భారతి, ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.