ఆధునిక ప్రపంచంలో అరచేతిలోకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచితో పాటు అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా సైబర్ నేరాలు, కొత్త తరహా మోసాలు ఆందోళన కలిగిస్తుండగా, జగిత్యాల జిల్లాలో సైబర్ మోసాల పర్వం పెట్రేగిపోతున్నది. ఈజీమనే లక్ష్యంగా, అమాయక ప్రజలే టార్గెట్గా గడిచిన వారంలోనే 23 మందికి టోకరా వేసి 9,96,827ను కొల్లగొట్టడం కలవరపెడుతున్నది. ఏదైనా పనిలో ఉన్నప్పుడు అలాంటి ఫోన్లు రావడం, ఏమరపాటుతో పిన్ నంబర్లు చెప్పడం తీరా అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయినట్లు ఫోన్కు మెస్సేజ్లు రాగానే లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తుండగా, పోలీసుశాఖ రంగంలోకి దిగింది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెస్సేజ్లను నమ్మొద్దని, చేసే ఆఫర్లను పట్టించుకోవద్దని ఊరూరా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
– జగిత్యాల కలెక్టరేట్, జూన్ 26
జగిత్యాల కలెక్టరేట్, జూన్ 26: వాళ్లు ఎక్కడుంటరో తెల్వదు.. ఎలా ఉంటారో తెల్వదు. కానీ బ్యాంకు వాళ్ల మాదిరి మాట్లాడుతరు. ఏటీఏం, యూపీఐ వివరాలడుగుతరు ఖాతాను మొత్తం ఊడ్చేస్తరు. ‘లాటరీ తగిలింది.. బహుమతి వచ్చిం ది.. ట్యాక్సులు కడితే ఇస్తామని’ ఆశ చూపుతరు. లక్షలు కట్టించుకొని పత్తాలేకుండా పోతరు. ‘పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు, మంచి కంపెనీలో ఉద్యోగం’ అంటూ ఊరిస్తరు. చిక్కితే అందినకాడికి దోచుకుంటరు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తరు. దోస్తులను పైసలడుగుతరు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి బెదిరిస్తరు. బ్లాక్మెయిల్ చేసి లక్షలు లాగుతరు. ఇలా రకరకాల మోసాలకు పా ల్పడుతూ జిల్లాలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నరు. గడిచిన వారం రోజుల్లో 23 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి 9,96,827ను కొల్లగొట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తుండగా, అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఆఫర్లను స్వీకరించవద్దని సూచిస్తున్నారు.
డెబిట్/క్రెడిట్ కార్డ్ ఓటీపీ ఫ్రాడ్..
‘హాలో.. మేం బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది. పునరుద్ధరించాలంటే కార్డు వివరాలతోపాటు మీ మొబైల్కు వచ్చే ఓటీపీ వివరాలు చెప్పాలని నమ్మిస్తారు. ఇలా ఫోన్ చేసే మోసగాల్ల మాటలు నమ్మి వివరాలు, ఓటీపీ వెల్లడిస్తే క్షణాల్లో ఖాతాను గుల్ల చేసేస్తున్నారు. ఇదే రకంగా సైబర్ మోసగాళ్లు ముగ్గురు వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును కాజేశారు.
యూపీఐ సంబంధిత మోసాలు..
డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా మోసాలు ఎక్కువగా అవుతుండడంతో ప్రజలు అప్రమత్తమయ్యా రు. దీంతో ఈ తరహా మోసాలు చాలా వరకు ఆగిపోయాయనే చెప్పవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఇప్పుడు డెబిట్/క్రెడిట్ కార్డులకు బదులుగా మొబైల్ ఫోన్ ద్వారా నగదు బదిలీలు, పేమెంట్లకు ఎక్కువగా యూపీఐ ద్వారా నే చేస్తున్నారు. ప్రజలు ఫోన్పే, గూగుల్ పే, పే టీఎం వంటి యూపీఐలను వాడుతుండడంతో సైబర్ నేరగాల్లు సైతం యూపీఐ మోసాలను మొ దలుపెట్టారు. స్నేహితులు, కస్టమర్ల నుంచి డబ్బు కోసం రిక్వెస్ట్ చేసే సదుపాయాన్ని యూపీఐ కల్పిస్తుంది. కస్టమర్ యూపీఐ పిన్ను నమోదు చేసి నగదును బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మనీ రిక్వెస్ట్ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు. క్యాష్ బ్యాక్, రుణాలు ఎర చూపి నగదు రిసీవ్ చేసుకునేందుకు పిన్ను నమోదు చేయాల్సిందిగా కోరుతారు. సైబర్ నేరగాల్ల మాయలో పడి యూ పీఐ పిన్ను నమోదు చేయడం వల్ల కస్టమర్ ఖాతా నుంచి డబ్బులు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి బదిలీ అయిపోతాయి. ఈ తరహా కేసుల్లో మోసపోయినట్లు జిల్లాలో 12 మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఇంటర్నెట్, నెట్ బ్యాంకింగ్ రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్
యూపీఐ లావాదేవీల తర్వాత అత్యధిక బ్యాంక్ ఖాతాదారులు వినియోగించేది ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ లేదా బ్రౌసింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసే సందర్భాల్లో, ఇతర ఏదైనా సమస్య పరిష్కారం కోసం సెర్చ్ చేసే క్రమంలో సైబర్ నేరగాల్లు ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సమస్యను సాల్వ్ చేస్తానని నమ్మించి టీమ్ వ్యూర్, ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయమంటాడు. తద్వారా మీ ఫోన్, కంప్యూటర్ సైబర్ నేరగాడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని కంప్యూటర్, ఫోన్లోని విలువైన సమాచారాన్ని తస్కరించడమో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకొని బ్యాంకు ఖాతాను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఈ తరహాలో సైబర్ నేరగాళ్లు జిల్లాలో నలుగురు వ్యక్తులను మోసం చేసి ఖాతాల్లోంచి నగదును ఊడ్చేశారు.
అవగాహన లోపం, అత్యాశ వల్లే మోసాలు..
గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక అత్యాశకుపోతున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. నిరక్షరాస్యులు, రైతులు, కార్మికులు వంటి వారికి ఫోన్ చేసి ‘ మీ ఏటీఎం బ్లాక్ అయింది, వ్యాలిడిటీ అయిపోయింది. ఆధార్ నంబర్ను బ్యాంకుకు అనుసంధానం చేస్తాం’ అంటూ వీరిని సులభంగా నమ్మిస్తున్నారు. నిజమని నమ్మి వాళ్లు అడిగిన సమాచారాన్నంతా ఇచ్చేస్తూ ఖాతాలను గుల్ల చేసుకుంటున్నారు. ఇక ‘లాటరీ తగిలింది. మా కంపెనీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తది. తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బు ఇస్తాం. తక్కువ ధరకే విలువైన వస్తువులను ఇస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా, మొబైల్ ఫోన్లకు మెసేజ్లు, లింకులు పంపి ఎరవేస్తారు. సులభంగా డబ్బులు వస్తున్నాయనే ఆశతో సైబర్ మాయగాల్ల బుట్టలో పడిపోతున్నారు.
అప్రమత్తతోనే చెక్
సరైన అవగాహన, అప్రమత్తతతో సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చు. ప్రజ ల్లో ఉన్న ఆశ, భయం అనే రెండు బలహీనతలపైనే ఆధారపడి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం కార్డు, బ్యాంకు అకౌంటు, పాన్ కార్డ్ వ్యాలిడిటీ అయిపోయిందని, వివరాలను అప్డేట్ చేసుకోకుం టే కార్డు, అకౌంట్ బ్లాక్ అవుతాయనే భయాన్ని కలిగించి ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఖాతాల్లోంచి నగదును లాగేస్తున్నారు. పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయని, ఉద్యోగాలు కల్పిస్తామంటూ సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ప్రకటనలను చూసి చదువుకున్న వారు సైతం అత్యాశకు పోయి మోసపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ను పట్టుకోవడం క్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రజలు మోసపోకుండా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. లాటరీలు, గిఫ్ట్ వచ్చిందని అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లను, మెసేజ్ల ను నమ్మవద్దు. ఓటీపీలు, ఏటీఎం నంబర్లు, ఏ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చెప్పవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నం. మోసపోయినవారు తక్షణమే 1930కి ఫిర్యాదు చేస్తే డబ్బులను రికవ రీ చేసే అవకాశం ఉంటుంది. గడిచిన వారం రోజుల్లో సైబర్ మోసాలపై 23 ఫిర్యాదులు వచ్చాయి. పలువురు బాధితులు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడంతో పోగొట్టుకున్న డబ్బుల్లోంచి 81,088ను ఫ్రీజ్ చేయగలిగాం.
– ఎగ్గడి భాస్కర్, ఎస్పీ (జగిత్యాల)