Vodithala Satish Kumar | చిగురుమామిడి, మే 18 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ పూర్తిస్థాయి విచారణకు సహకరించేలా సంజయ్ కు సూచించాలన్నారు. తప్పు చేసిన కొడుకుని తొమ్మిది రోజులు కేంద్రమంత్రిగా బండి సంజయ్ దాచి పెట్టారని, అలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాకుండా దేశానికే అవమానకరమన్నారు.
మైనర్ బాలికకు అన్యాయం చేసిందే కాకుండా వారు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బండి భగీరథ్ కేసును నీరు కార్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. మీడియా గొంతు నొక్కి వార్తలు రాయనీయకుండా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి నాటకమాడుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే నేడు ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. బండి భగీరత్ లొంగిపోయాడని ఒకరు, అరెస్టు చేశామని మరొకరు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మామిడి అంజయ్య, అనుమాండ్ల సత్యనారాయణ, దోనపాటి కృష్ణారెడ్డి, దామ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.