MLA Dr. Sanjay | కోరుట్ల, జూన్ 19: నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 28న పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీల ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారని తెలిపారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐఐటీ, ఫార్మసీ డిప్లొమా కోర్సులు చదివిన యువతి, యువకులకు జాబ్ మేళాలో సాఫ్ట్వేర్, సర్వీసెస్ కంపెనీలు, ఫైనాన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, బ్లూ కలర్ జాబ్స్ కంపెనీలు తమ కంపెనీల్లో సుమారు రెండు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ముందుగానే ఇంటర్వ్యూల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగం ఎంతో పురోభివృద్ధి సాధించిందని చెప్పారు.
అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదుకు క్యూ కట్టిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని ఆదాయంలో స్థూల ఉత్పత్తిలో అట్టడుగు స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఆయనవన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, అందాల పోటీలు నిర్వహించి నవ్వులపాలైందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాట్లకు నాట్లకు రైతుబంధు, పెట్టుబడి సాయం అందిస్తే, సీఎం రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు పబ్లిసిటీ కోసం రైతు భరోసా తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా 11 పర్యాయాలు రైతులకు రైతుబంధు అందించామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఏపీలో నిర్మిస్తున్న బనకచర్లపైనే కాకుండా, తెలంగాణలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పైన కూడా అవగాహన లేకపోవడం ఆయన బాధ్యతరాహిత్య పాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయని, ఈ విషయంలో తెలంగాణ యువత పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటీ వెంకటరావు, మండల అధ్యక్షుడు దారీశెట్టి రాజేష్, నాయకులు భాస్కర్ రెడ్డి మోహన్ రెడ్డి, మురళి, అతిక్, నగేష్, గంగాధర్, సురేందర్, సంతోష్, నవీన్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.