Ramagundam | కోల్ సిటీ, మార్చి 16 : రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ కు సంబంధించిన రూ.13.7 కోట్ల నిధులతో ఏడు ప్యాకేజీలుగా యూజీడీ పనులకు టెండర్లు పిలిచారని, కాంట్రాక్టర్లు రింగ్ ఏర్పడి అధికారులతో కుమ్మక్కై 0.5 నుంచి 1.5 శాతం లెస్ పర్సంటేజీలతో పనులను దక్కించుకున్నారని ఆరోపించారు. పైగా ఆర్సీసీ వైపులకు బదులుగా మట్టి పైపులను వినియోగిస్తూ నాసిరకం పనులు చేస్తున్నారని, ఈ విషయమై నగర పాలక అధికారులకు ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని పేర్కొన్నారు.
ఈ లోగా బిల్లులు కాజేసేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. యూజీడీ పనుల్లో క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీలు లేకుండానే అధికారులు సైతం బిల్లులు మంజూరు చేసేందుకు చొరవ చూపడం పట్ల అనుమానాలు ఉన్నాయని, రూ.13.7 కోట్లు డ్రైనేజీ పాలు కాకుండా వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటివరకు బిల్లుల జారీ ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీడీఎంఏకు, ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.