కమాన్చౌరస్తా, మార్చి 23 : కరీంనగర్లోని శాతవాహన యూనివర్సీటీకి 12-బీ హోదా దక్కింది. బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్యూకు అరుదైన గుర్తింపు దక్కడంతో వీసీ, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్గా మల్లేశం సంకశాల బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో ఈ ఖ్యాతిదక్కడంతో పలువురు ఆయనను అభినందించారు. 2008లో యూనివర్సిటీ ప్రారంభమైన 2011వరకు అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్యే కొనసాగింది. కాలక్రమేణా ప్రగతి సాధిస్తూ పలు విభాగాలను ఏర్పాటు చేశారు. 12-బీ హోదా సాధన కోసం అప్పటి ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ నేతృత్వంలో యూనివర్సీటీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు యూజీసీకి వినతిపత్రాలు అందజేశారు. 2021, మే 24న ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన సంకశాల మల్లేశ్ 12- బీ సాధనకు నిరంతరం కృషి చేశారు. గత డిసెంబర్ 9, 10 తేదీల్లో యూనివర్శిటీ పరిశీలనకు వచ్చిన యూజీసీ సభ్యులకు మంత్రి గంగుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కాగా, ప్రస్తుతం బీ-12 గుర్తింపు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
శాతవాహన యూనివర్సిటీకి 12-బీ గుర్తింపు రావడంపై విశ్వవిద్యాలయ వర్గాలతో పలువురు ప్రముఖులు వీసీ మల్లేశ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెగ్యూలర్ వీసీగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరంలోపే ఈ ఘనత సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్ఛాలు అందజేశారు.
వైస్ చాన్స్లర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 12-బీ సాధనే లక్ష్యంగా ముందుకెళ్లాం. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లను కేటాయించాం. సమష్టిగా ముందుకెళ్లి విద్యార్థులకు సకల సౌకర్యా లు కల్పించాం. గత డిసెంబర్లో యూజీసీ సభ్యులు యూనివర్శిటీ సందర్శించి హర్షం వ్య క్తం చేశారు. ఈ ప్రత్యేక హోదాతో మేలైన పరిశోధనలకు అవకాశం ఉంటుంది.
– ఫ్రొఫెసర్ మల్లేశ్, వీసీ, శాతవాహన యూనివర్సిటీ