కరీంనగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్ : కరోనా పేరువినగానే ప్రతి ఒక్కరిలోనూ భయం పుడుతున్నది. మూడేళ్ల క్రితం ప్రళయం సృష్టించిన వైరస్, తాజాగా మరోసారి కమ్ముకొస్తున్నదని తెలిసి భయాందోళన కనిపిస్తున్నది. అయితే గతంలో ఒమిక్రాన్, డెల్టా వంటి సబ్ వేరియంట్స్ రాగా, ఇప్పుడు కేరళ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో జేఎన్.1 అనే వేరియంట్ సోకుతుండడం కలవరపెడుతున్నది. ఇది గతంలో వచ్చిన ఒమిక్రాన్కు సబ్ వేరియంటని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వైరస్ను ఎదురొనేందుకు ప్రభుత్వ దవాఖానల్లో చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. నాడు కరోనా సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్న అనుభవజ్ఞులైన వైద్యులను సిద్ధంగా ఉంచారు.
గతంలో పది వేలకుపైగా కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఇప్పుడు కరోనా వార్డును సిద్ధం చేసి, 120 బెడ్స్ ఏర్పాటు చేశారు. అందులో ప్రతి బెడ్కు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. 74 వెంటిలేటర్లు, అందుబాటులో ఉన్న 2 ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంట్లను కూడా సిద్ధం చేశారు. ఆక్సిజన్ కంట్రేడర్స్ను రెడీగా ఉంచారు. వారం క్రితమే మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం 2,300, ర్యాపిడ్ టెస్టుల కోసం 400 కిట్స్ను అందుబాటులో ఉంచారు. జేఎన్-1 వైరస్ సోకినట్లు అనుమానించిన 30 మందికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నుంచి ప్రతి అనుమానితులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెబుతున్నారు.
కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ కలవరపెడుతున్నది. తాజాగా కరీంనగర్లో రెండు కేసులు వెలుగులోకి రావడం భయపెడుతున్నది. ఇప్పటికే రంగంలోకి దిగిన యంత్రాంగం, వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ కిట్స్, మందులు ఉంచడమే కాదు, జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ సదుపాయంతో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తున్నది. కరీంనగర్లో 120 ఆక్సిజన్ బెడ్స్ను సిద్ధం చేసింది. ఈ వైరస్తో పెద్దగా మప్పు లేకపోయినా ఎక్కువ మందికి సోకే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని, బయటికి వెళ్తే మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
2020-21లో కరోనా కరాళ నృత్యం చేసింది. అనేక మందిని పొట్టన పెట్టుకున్నది. 2022లో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత నుంచి కట్టడి చేసినా.. అప్పుటి దాకా అప్పటి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. 2020 మార్చి 17, 18 తేదీల్లో ఇండోనేషియా నుంచి కొందరు మత ప్రచారకులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకోగా, వీరందరికీ కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు అప్పటి యంత్రాంగం గుర్తించింది. వెంటనే వారిని హైదరాబాద్లో ఉన్న ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించింది. అప్పటికే ముగ్గురు స్థానికులకు కూడా ఈ వైరస్ సోకినట్లు గుర్తించి, దేశంలోనే మొదటి కంటైన్మెంట్ ఏరియాను కరీంనగర్లోనే ఏర్పాటు చేసింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వైరస్ కట్టడికి ఇక్కడ తీసుకున్న చర్యలు దేశానికే రోల్మోడల్గా నిలువగా, మార్చి నుంచి మే వరకు నిరంతరాయంగా 58 రోజుల పాటు లాక్డౌన్ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో 350 బెడ్స్తో కరోనా వార్డులు ఏర్పాటు చేసి, పది వేలకుపైగా బాధితులకు మెరుగైన చికిత్స అందించారు. ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి సేవలందించారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కరోనా వేరియంట్ వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కరోనా జేఎన్-1 వేరియంట్ కరీంనగర్ జిల్లాను తాకింది. సోమవారం ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా, ఈ వైరస్ వచ్చినట్టు తెలిసింది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ వీరారెడ్డి ధ్రువీకరించారు. హైదరాబాద్లోని జీనమ్ సీక్వెన్స్ లాబ్కు శాంపిళ్లను పంపించినట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన వైద్యాధికారులు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇది వరకే ప్రకటించారు.
కొత్త వేరియంట్ జేఎన్-1 ఎక్కువగా కేరళ రాష్ట్రంలో విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, గుంపులు గుంపులుగా వెళ్లవద్దని చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ర్టాలకు వెళ్లి వచ్చిన వారు, విదేశాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా కొవిడ్ పరీక్ష చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సోకిన వారిలో వైరస్లో ప్రభావం అంతగా లేదని, దీని తీవ్రతపై ఇంకా ఒక అంచనాకు రాలేదని చెబుతున్నారు. అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇమ్యూనిటిని పెంచుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా జేఎన్-1 వేరియంట్తో పెద్దగా ప్రమాదం లేకున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చలి గాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ప్రమాదాల బారిన పడే ప్రమాదమున్నది. మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని మందులు వాడి ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఇప్పటికే 30 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– నవీన, అదనపు ఆర్ఎంవో (కరీంనగర్)
కొవిడ్ నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో 100 బెడ్స్తో ఐసీయూ, ప్రాథమిక లక్షణాలు ఉన్న వారి కోసం 20 పడకలతో శారీ వార్డును ఏర్పాటు చేశాం. ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే దవాఖానలో మాక్డ్రిల్ నిర్వహించాం. పూర్తి స్థాయిలో పరీక్షల కిట్లు, మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
– గుండా వీరారెడ్డి, సూపరింటెండెంట్ (కరీంనగర్)
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. లేదంటే కరోనా కొత్త వేరియంట్ ఎక్కువగా ప్రబలే ప్రమాదమున్నది. జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరముంటేనే బయటికి వెళ్లాలి. తప్పని సరిగా మాస్క్ వాడాలి. ప్రజలు గుంపులుగా ఉండకూడదు. వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేసుకోవాలి. ప్రతి పీహెచ్సీలో ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– లలితాదేవి, డీఎంహెచ్వో (కరీంనగర్)