సమైక్య పాలనలో గతుకుల రోడ్లతో కళ తప్పిన సిరిసిల్ల నేడు తారురోడ్లతో తళతళలాడుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో రహదారులకు రాజయోగం పడుతున్నది. ఇప్పటికే కొత్తగా నిర్మించిన రగుడు-వెంకటాపూర్, రగుడు-ఎల్లమ్మ జంక్షన్ వరకు ఆరు వరుసల రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. ఈ రెండు బైపాస్ రోడ్లలో సెంట్రల్లైటింగ్ ఏర్పాటుతోపాటు రగుడు, శాంతినగర్, చంద్రంపేట జంక్షన్ల సుందరీకరణకు అంతా సిద్ధమైంది. ఇవన్నీ పూర్తయితే పట్టణం సరికొత్త శోభను సంతరించుకోనున్నది.
– రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధించిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాను ఏర్పాటు తర్వాత విరివిగా నిధులు మంజూరు చేస్తూ సకల హంగులు సమకూరుస్తున్నారు. అగ్రికల్చర్, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, ఐటీఐ కళాశాలలను తీసుకొచ్చి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి రహదారుల నిర్మాణానికి చొరవ చూపారు. నాడు కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలను కలిపే ఒకే రహదారి ఉండేది. పెరుగుతున్న జనాభా, పట్టణ అవసరాలకు అనుగుణంగా ఆరు వరసల రోడ్లతో రెండు బైపాస్లు నిర్మించారు. రోడ్లు అందుబాటులోకి రావడంతో వాహన చోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయి. అద్దంలా మెరుస్తున్న రహదారులపై రయ్మంటూ వాహనదారులు దూసుకెళ్తున్నారు.
95 కోట్లతో రగుడు, వెంకటాపూర్ బైపాస్
జిల్లా కేంద్రంలోని రగుడు సమీపంలోని సమీకృత కలెక్టరేట్ చౌరస్తా నుంచి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల మేర వంద ఫీట్ల వెడల్పుతో ఆరువరసల రహదారి నిర్మించారు. అందుకు 95కోట్లు ఖర్చు చేశారు. కామారెడ్డి, కరీంనగర్, వరంగల్కు వెళ్లే భారీ వాహనాలు పట్టణంలోని రహదారులపై వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ కొత్త బైపాస్ రహదారి నిర్మాణానికి సంకల్పించారు. వెంటనే నిధులు కేటాయించి రోడ్డు వేయించారు. ఈ రహదారి నిర్మాణం వల్ల భారీ వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తీరాయి. కాగా ఈబైపాస్ రోడ్డులోని అప్పారెల్ పార్కు ఉంది. మెడికల్ కళాశాల, హరిత హోటళ్లు ప్రగతిలో ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్డు మార్గం ప్రధాన రహదారిగా మారే అవకాశాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వంద ఫీట్ల రహదారిని నిర్మించారు.
4.90 కోట్లతో మూడు జంక్షన్లు
పట్టణానికి ఇరువైపులా రెండు బైపాస్ రహదారులు కొత్తగా నిర్మించారు. రగుడు వద్ద సమీకృత కలెక్టరేట్, పోలీస్ భవనం, తెలంగాణ భవన్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ రహదారులను కలిపే ఈరోడ్డులో అతిపెద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. 3.10 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే రగుడు నుంచి మానేరు బ్రిడ్జి వరకు ఆరుస వరుసల రహదారి పక్కనే నర్సింగ్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయం, అంబేద్కర్ భవనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలున్నాయి. నర్సింగ్ కళాశాల చౌరస్తాలో జంక్షన్, చంద్రంపేట క్రాస్రోడ్డు వద్ద జంక్షన్లకు 1.80కోట్ల నిధులు మంత్రి మంజూరు చేశారు. జంక్షన్ల సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభించ బోతున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేశామని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మూడు జంక్షన్లను సుందరీకరించనున్నారు. అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిన సిరిసిల్ల పట్టణం జంక్షన్ల నిర్మాణంతో మరింత శోభను సంతరించుకోనున్నది.
7.10 కోట్లతో సెంట్రల్ లైటింగ్
జంక్షన్లతో పాటు రెండు బైపాస్ రహదారుల మధ్య సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఈడీ బల్బులు, మధ్యలో గ్రీనరి, పూల మొక్కలు నాటనున్నారు. రగుడు నుంచి మానేరు బ్రిడ్జి వరకు బైపాస్రోడ్డులో రూ. 4కిలోమీటర్ల మేర రూ. 2.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రెండో బైపాస్రోడ్డులో రగుడు నుంచి వెంకటాపూర్ వరకు 11కిలోమీటర్ల దూరం రూ. 4.20కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి నిధులు మంజూరు కావడంతో పనులు తొందరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రంపేట జంక్షన్ నుంచి మొదటి బైపాస్రోడ్డును కలుపుతూ శాంతినగర్ జంక్షన్ వరకు కొత్తగా మరో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు.
పనులు వేగవంతం చేస్తాం
మంత్రి కేటీఆర్ సహకారంతో 12కోట్లతో జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టబోతున్నాం. రెండు బైపాస్ల నిర్మాణంతో పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. రోడ్ల మధ్య డివైడర్లు, సెంట్రల్లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రగుడు, శాంతినగర్, చంద్రంపేట క్రాస్రోడ్ల మధ్య గల జంక్షన్లను సుందరీకరిం చనున్నాం. ఇప్పటికే డివైడర్ల పనులు ప్రారంభించాం. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన కేటీఆర్కు పాలకవర్గ పక్షాన కృతజ్ఞతలు.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్ (సిరిసిల్ల)