పెగడపల్లి మండలంలో హైలెవల్ వంతెనలు
నాడు వర్షం వచ్చిందంటే రాకపోకలు బంద్
ఏండ్లపాటు మండల ప్రజలకు నరకం
స్వరాష్ట్రంలో తీరిన దారి కష్టం
ఆరుచోట్ల రూ.13 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం
సాఫీగా సాగుతున్న ప్రయాణం
పెగడపల్లి, జూలై 4 : పెగడపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టం తీరింది. దశాబ్దాలుగా లోలెవల్ బ్రిడ్జిలతో పడ్డ నరకం దూరమైంది. మండలంలోని పలు ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల మధ్య లోలెవల్ కల్వర్టులు చుక్కలు చూపించేవి. వర్షం వచ్చిందంటే చాలు రాకపోకలు బందయ్యేవి. రెండు మూడు రోజుల దాకా దాటనిచ్చేవికావు. ఆయాచోట్ల హైలెవల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు ఏండ్లపాటు విజ్ఞప్తులు చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
స్వరాష్ట్రంలో తీరిన వెతలు..
ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రస్తుత మంత్రి, అప్పటి చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ స్వరాష్ట్రంలో పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వానికి నివేదించి పలు గ్రామాలకు చెందిన ప్రధాన ఆర్అండ్బీ రోడ్లపై లో-లెవల్ కల్వర్టుల స్థానంలో ఆరు ప్రాంతాల్ల్లో సుమారు రూ.13 కోట్ల ఖర్చుతో హై-లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే నిర్మాణాలు పూర్తి చేయించి మండల ప్రజల కష్టాలు తీర్చారు.