పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఎప్పటిలాగే మళ్లీ మోసపోతున్నారు. పెట్టుబడులు పెట్టి, కష్టనష్టాలకోర్చి పండించిన పంటను మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు తీసుకొస్తే.. అడ్తీ వ్యాపారుల ఎత్తుగడలతో చిత్తవుతున్నారు. తమ అడ్తీలోకే దిగుబడులు తెచ్చేలా చేస్తున్న మాయాజాలంలో చిక్కుతున్నారు. చిన్న కుప్పలకు 14వేల వరకు కోట్ చేస్తున్నా.. పెద్ద కుప్పలకు 7 నుంచి 10 వేలలోపే ధర పలుకుతుండడంతో నష్టపోతున్నారు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కమీషన్ ఏజెంట్లు తెలివిగా తమను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎనిమిది నెలలపాటు కష్టపడి పంట పండించిన తమకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు.
మెట్పల్లి, ఫిబ్రవరి 24 : వాణిజ్య పంట అయిన పసుపును జగిత్యాల జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా కోరుట్ల, మెట్పల్లి డివిజన్లలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఎక్కువగా పంటను పండిస్తున్నారు. ఈ సారి మొత్తం 21వేల ఎకరాల్లో పంట వేశారు. అందులో 15 వేల ఎకరాల వరకు ఈ రెండు డివిజన్లలోనే వేశారు. మొత్తం 5 వేల మంది వరకు రైతులు సాగు చేస్తున్నారు. వానకాలం సీజన్లో సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికి వస్తున్నది. ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది.
అయితే ఎనిమిది నెలలపాటు అష్టకష్టాలు పడి పంట పండిస్తే.. ఇప్పుడు సరైన ధర లేక రైతులు తెల్లమొఖం వేస్తున్నారు. పసుపు మార్కెట్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ తర్వాత రెండోదైన మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు దిగుబడులు తీసుకొస్తున్నా.. సరైన ధర లేక నిరాశ చెందుతున్నారు. పసుపు సీజన్ ప్రారంభమై నెల అవుతుండగా.. కొందరు అడ్తీ వ్యాపారులు (కమీషన్ ఏజెంట్లు) కొందరు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రైతులు తమ అడ్తీలోకి ఎక్కువ సరకు తెచ్చేలా సరికొత్త ఎత్తుగడలకు దిగుతున్నారు.
అమ్మకానికి వచ్చిన ఏదో ఒక చిన్న పసుపు కుప్పను ఎంచుకొని అధిక ధరకు పాటపడుతూ, మిగతా పెద్ద కుప్పలకు 8వేల నుంచి 10వేలలోపు ధరను కోట్ చేస్తున్నారు. ఫలానా అడ్తీదారు కల్లంలోకి పసుపు తీసుకెళ్తే ఎక్కువ ధర వస్తుందనే ఆశతో చాలా మంది రైతులు, తమ పసుపు ఉత్పత్తులను తరలించి మోసపోతున్నారు. తీరా ఆన్లైన్లో కోట్ చేస్తున్న ధరను చూసి నివ్వెరపోతున్నారు. ఏదో ఒక క్వింటాల్, రెండు క్వింటాళ్లలోపు ఉన్న చిన్న కుప్పకు అధిక ధరతో కోట్ చేసి, అంతకన్నా ఎక్కువ క్వింటాళ్ల పసుపు కలిగిన కుప్పలకు కావాలనే తక్కువ ధరను కోట్ చేసి దగా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఎకరానికి 80 వేల వరకు పెట్టుబడి పెట్టి, ఎనిమిది తొమ్మిది నెలలు కష్టపడినా ప్రయోజనం దక్కకుండా పోతున్నదని ఆవేదన చెందుతున్నారు. కేవలం తమ అడ్తీ దుకాణంలో వ్యాపారం పెంచుకొని, ఎక్కువ మొత్తంలో కమీషన్ పొందేందుకే కొందరు ఏజెంట్లు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పసుపుకొనే ట్రేడర్లు ఎక్కువ సంఖ్యలో ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొనకపోవడంతో పోటీ లేక పసుపునకు సరైన ధర పలకడం లేదని చెబుతున్నారు. మార్కెట్లో జరుగుతున్న పసుపు క్రయ, విక్రయాలు, ధరలపై అధికారులు పర్యవేక్షించాలని, రైతులు నష్టపోకుండా చూడాలని అభిప్రాయపడుతున్నారు.