తెలంగాణచౌక్, జనవరి 19 : టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. రీజియన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ప్రతి రోజూ వంద బస్సులను కరీంనగర్కు నడిపించారు. పండుగ ముందు రోజు వరకు ప్రయాణికుల రద్దీ కొనసాగింది. ప్రతి రోజూ రీజియన్ పరిధిలో 2 లక్షల 50 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడిచిన బస్సుల ద్వారా రీజియన్లో రూ.12 కోట్ల 28 లక్షల 43 వేల ఆదాయం వచ్చింది.
అందులో 18వ తేదీ ఒక్కరోజే రూ.2 కోట్ల 5లక్షల 77 వేలు వచ్చాయి. 11 డిపోల నుంచి బస్సులు 4 లక్షల 25 వేల కిలోమీటర్లు తిరుగగా, ప్రతి రోజూ రూ.కోటి ఆదాయం సమకూరింది. ఇందులో 10వ తేదీన రూ.1,33, 94000, 11న రూ.1,49,51000, 12న రూ.1,70,18000, 13న రూ.1,70,18000, 14న రూ.1,37,53000, 15న రూ.76, 2800, 16న రూ.1,54,13000, 17న రూ.1,83,99000, 18న అత్యధికంగా రూ.2,50,77000 ఆదాయం వచ్చింది. రీజియన్ పరిధిలో ఇంత ఆదాయం గడించడానికి కృషి చేసిన డిపో మేనేజర్లు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రయాణికులు ఆదరించారు
ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించారు. ప్రతి ప్రయాణికుడు గమ్యస్థానం చేరుకునేలా డిపో మేనేజర్లు, అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జూబ్లీ స్టేషన్ నుంచి 830 బస్సులను ప్రత్యేకంగా నడిపించాం. నాతో పాటు అధికారులు నాలుగు రోజులు జూబ్లీ స్టేషన్లో ఉండి ప్రయాణికులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశాం. తిరుగు ప్రయాణికుడికి టికెట్ మీద పది శాతం రాయితీ కూడా కల్పించాం. బస్సులో సీటు కోసం ఎదురు చూడకుండా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యంతో సుఖంగా ప్రయాణించేలా అవకాశం లభించింది.
-ఖుస్రోషాఖాన్, ఆర్ఎం, కరీంనగర్
బస్టాండ్లో ఉండి సేవలు అందించాం
సంక్రాంతి పండుగకు ఎక్కువ మంది తమ స్వస్థలాలకు వెళ్తారని అంచనాతోనే బస్సులు సిద్ధం చేశాం. ప్రతి రోజూ బస్స్టేషన్లో ఉండి సేవలను అందించాం. రాత్రి సమయంలోనూ ప్రయాణికుల రద్దీని బట్టి గ్రామాలకు బస్సులు నడిపించాం. సిబ్బంది అంతా సేవలు అందించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్న ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లడం కోసం బస్సులు ఏర్పాటు చేశాం.
– మల్లయ్య, కరీంనగర్ డిపో-2 మేనేజర్