తెలంగాణచౌక్, మే 11 : టీఎస్ ఆర్టీసీ రాయితీల ద్వారా ఎన్నో స్కీమ్లు ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు 50శాతం రాయితీతో బస్పాస్లు అందిస్తున్నది. ఉద్యోగులు, వ్యాపారులకు సీజన్లో 30రోజుల టికెట్లో 20రోజలకు మాత్రమే చార్జీలు చెల్లించేలా అవకాశం కల్పించింది. 12ఏండ్ల లోపు విద్యార్థులు, డయాలసిస్ పెషేంట్లు, స్వాతంత్య్ర సమరయోధులు, జర్నలిస్టులకు ఉచితంగా బస్పాస్లు అందిస్తున్నది. ఈ క్రమంలో సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.
తక్కువ చార్జీలతో అద్దె సౌకర్యం
వివాహాది శుభకార్యాలు, తీర్థయాత్రలకు బస్ ఆన్ కాంట్రాక్ట్ స్కీమ్ ద్వారా 10 శాతం రాయితీతో ప్రైవేట్ కన్నా.. తక్కువ చార్జీలతో అద్దెకు బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుపతికి వెళ్లే భక్తులకు బస్ టికెట్తోపాటు స్వామివారి సదర్శనం టికెట్ను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోనే అవకాశం కల్పించారు. ప్రయాణికులను సురక్షింగా గమ్యస్థానం చేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్న టీఎస్ ఆర్టీసీని మరింత ఆదరించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.
ప్రయాణికులు ఆదరించాలి
టీఎస్ ఆర్టీసీలో ప్రయాణకుల సంఖ్యను పెంచడానికి రాయితీలు అందిస్తున్నాం. వివిధ రకాల స్కీమ్లతో ముద్రించిన కరపత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. ఆర్టీసీ సేవలను మరింత మంది సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నలు చేస్తున్నాం. సంస్థను మరింత మంది ప్రయాణికులు ఆదరించాలి.
– సుచరిత, ఆర్ఎం (కరీంనగర్)
స్కీమ్లు వివరిస్తున్నాం
ప్రయాణికులకు ఆర్టీసీ అందిస్తున్న స్కీమ్లపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. బస్పాస్లు, రాయితీలు, అద్దె బస్సులు సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. వివాహాది శుభకార్యాలు, తీర్థయాత్రలకు 10 శాతం రాయితీతో అద్దెకు బస్ సౌకర్యం కల్పిస్తున్నాం.
– ప్రణీత్, మేనేజర్ (కరీంనగర్డిపో-1)