కరీంనగర్ ముకరంపుర/ హుజూరాబాద్టౌన్, మార్చి 2: ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. కరీంనగర్లోని పోచమ్మవాడ, హుజూరాబాద్ పట్టణంలో శనివారం గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు జీరో బిల్లులను అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం వర్తిస్తుందన్నారు. మరోసారి ఎంపీడీవో కార్యాలయాలు, లేదా మున్సిపాలిటీల్లో విద్యుత్ కనెక్షన్ నెంబర్, ఆహారభద్రతా కార్డు(రేషన్కార్డు), ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తును ధ్రువీకరించిన తర్వాత విద్యుత్ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తు సవరణ ప్రక్రియను పూర్తి చేసి జీరో బిల్లు అందజేస్తారని తెలిపారు. ఇప్పటికే సమర్పించిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే వాటిని కూడా సవరించుకోవచ్చని వివరించారు. ఒక వేళ దరఖాస్తు పెండింగులో ఉంటే దరఖాస్తు పరిశీలన అయ్యేంత వరకు విద్యుత్ సిబ్బంది బిల్ వసూలుపై చర్యలు తీసుకోరని తెలిపారు. ఆయన వెంట సీఈ రాజుచౌహాన్, కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వీ గంగాధర్, డీఈలు రాజం, అనిల్కుమార్, లక్ష్మారెడ్డి, ఏడీఈలు నరేందర్, శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, శ్రీనివాస్గౌడ్, ఎం వీరాచారి ఉన్నారు.