నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయి. నాటి పాలకులు వైద్య రంగాన్ని అటకెక్కించగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో అనతి కాలంలోనే సర్కారు వైద్య సేవలు అన్ని వర్గాలకు చేరువయ్యాయి. ఏ రోగం వచ్చినా ఒకే సూది మందు, ఒకే మందు బిల్ల ఇచ్చిన చోటే కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వం వైద్యం అందుతున్నది. కొవిడ్ వంటి విపత్కర సమయంలో ప్రైవేట్ దవాఖానలు మూతబడగా, రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నది. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్యారోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కరీంనగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్: ఒకప్పుడు సర్కారు వైద్యం అంటే చిన్న చూపు ఉండేది. అప్పటి ప్రభుత్వాల వైఫల్యాలు, నిరాదరణ కారణంగా ప్రైవేట్ వైద్య రంగం బలపడింది. సర్కారు వైద్యం అంటేనే జనం భయపడేవారు. ఏ చిన్న రోగమైనా నయం చేయించుకునేందుకు ప్రైవేట్ దవాఖానలనే ఆశ్రయిం చే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీగా నిధులు కేటాయించి పూర్తిగా ప్రక్షాళన చేసింది.
ప్రజలకు ప్రైవేట్లో అందుబాటులో లేని అనేక సదుపాయాలను ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తూ వస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన దవాఖానాల్లో టీ హబ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో నిరుపేదలు పరీక్షలు చేయించుకుంటున్నారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచింతంగా అందుతోంది. పాలియేటివ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు వైద్య సేవలు పొందుతున్నారు. రేడియాలజీ హబ్ ఏర్పాటు చేయడంతో ఖరీదైన సిటీస్కార్, ఎక్స్రే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శస్త్ర చికిత్సల విభాగాలన్నింటినీ బలోపేతం చేయడం, పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంతో అన్ని రకాల శస్త్ర చికిత్సలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుతున్నాయి. ఒక పక్క పీహెచ్సీ, యూహెచ్సీలు ఉండగానే ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచాలనే లక్ష్యంతో తాజాగాచ ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రాల్లోని అన్ని దవాఖానాల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆత్యవసర వైద్య సేవల్లో ప్రాణవాయువును అందిస్తున్నది. ఒకప్పుడు సర్కారు వైద్యమంటే జడిసిన రోగులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేందుకు ఏమాత్రం సంకోచించకుంటా పూర్తి విశ్వాసంతో వస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో వైద్య సేవలు
చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతమయ్యాయి. అంతకు ముందున్న పరిస్థితులన్నీ క్రమంగా మారుతూ వచ్చాయి. చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్ని శాఖలకంటే వైద్య, ఆరోగ్య శాఖను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. ఉమ్మడి జిల్లాలో 2016లో కేవలం 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 93కు పెంచారు. అప్పుడు అన్ని దవాఖానాల్లో కేవలం 1,342 బెడ్స్ మాత్రమే ఉండగా, ఇప్పుడు 2,850కి పెంచారు. సిబ్బంది నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించింది. అప్పుడు 3,149 మంది మాత్రమే ఉండగా, ప్రస్తుతం 4,318కి పెంచారు. గత ప్రభుత్వాలు మెడికల్ విద్యను పట్టించుకోలేదు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది.
ఈ కళాశాలల్లో ప్రతి విద్యా సంవత్సరంలో 500 మెడికల్ సీట్లకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1 నర్సింగ్ స్కూల్, 2 నర్సింగ్ కళాశాలల్లో 240 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక అప్పటికీ ఇప్పటికి ప్రభుత్వ దవాఖానాల్లో ఓపీల సంఖ్య చూస్తే గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు అన్ని దవాఖానాల్లో కేవలం 2,400 మందికి మాత్రమే ప్రతి రోజూ ఓపీ చూడగా, ఇప్పుడు ఆ సంఖ్య 5,600కు పైగా పెరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2016కు ముందు రోజుకు కేవలం 24 ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 129 జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 326 పల్లె, 19 బస్తీ దవాఖానలు, 16 మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక 108 వాహనాలు 35, 102 వాహనాలు 26 ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నాయి.
పేదల సంజీవని కరీంనగర్ దవాఖాన
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతోంది. గతానికీ ఇప్పటికి అనేక మార్పులు తెచ్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో 150 బెడ్స్ ఏర్పాటు చేయగా, అవి సరిపోకపోవడంతో మరో 100 పడకలు పెంచారు. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతున్నాయి. శిశు సంరక్షణ యూనిట్ను ప్రారంభించి నవజాత శిశువులకు అందించే విలువైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానాలోలూ అనేక మార్పులు తెచ్చి పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నది. గతంలో కేవలం 250 పడకలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 650కి పెంచింది. 20 పడకలతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. టీహబ్ ఏర్పాటు చేసి 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకుఎన్సీడీ విభాగాన్ని ప్రారంభించింది.
చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పోషకాహార లోపంతో జన్మించిన నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా డైస్ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వంటి విపత్కర సమయంలో 100 బెడ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, దవాఖానాలోని ప్రతి బెడ్కు ఆక్సిజన్ పాయింట్ ఇచ్చి సేవలు అందించింది. తాజాగా, ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. ప్రతి విభాగంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నది. రోగులను కంటికి రెప్పలా చూసుకుంటుండడంతో ప్రతి రోజూ 800 నుంచి 900 ఓపీ నమోదవుతోంది. ఇలా అనేక రకాలుగా సంస్కరించబడిన కరీంనగర్ ప్రభుత్వ దవాఖానా కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా వైద్య సేవలు అందిస్తూ పేదల సంజీవనిగా మారింది.
పేదలకు చేరువైన వైద్యం
తారక రామానగర్.. దాదాపు 40 ఏండ్ల క్రితం జగిత్యాల పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో అప్పటి సీఎం ఎన్టీయార్ పేరుపై ఏర్పడ్డ ఓ కాలనీ.. నిరుపేదలకు ఈ కాలనీలో ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఉచితంగా అందజేసింది. ఎలాంటి వ్యవసాయ భూమిలేని కాలనీగా, తదనాంతర కాలంలో గ్రామంగా తారక రామానగర్ పేరు గాంచింది. పూర్తిగా నిరక్షరాస్యులు, నిరుపేదలు, సంచారజాతి వారే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏ అవసరాలకోసమైనా జగిత్యాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాలు గడిచినా ఇక్కడ సౌకర్యాల కల్పన గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యంగా వైద్య సాయం కోసం ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేశారు.
మూడువేల జనాభా ఉన్న టీఆర్నగర్ను రెండు వార్డులుగా విభజించారు. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి కాలనీ రూపు రేఖల్లో అభివృద్ధి ఛాయలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వైద్యం విషయంలో మార్పులు వచ్చాయి. గతేడాది జగిత్యాల నియోజకవర్గానికి రెండు బస్తీ దవాఖానలు మంజూరు కాగా, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ టీఆర్నగర్లో ఒకటి ఏర్పాటు చేయించారు. గతేడాది ఆగస్టు 22న రూ.14.15 లక్షలతో బస్తీ దవాఖాన ప్రారంభమైంది. వైద్యురాలితో పాటు, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మంజూరు చేశారు. ప్రస్తుతం డాక్టర్ స్పందన, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వైద్య సేవలతోపాటు, రక్త, మూత్ర పరీక్షలు సైతం ఇక్కడే నిర్వహించి, అవసరమైన మందులు అందిస్తున్నారు. ప్రతి రోజూ 25 నుంచి 30 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ఇదే విషయమై డాక్టర్ స్పందన మాట్లాడుతూ, బస్తీ దవాఖానతో కాలనీవాసులకు వైద్యసేవలు త్వరగా అందుతున్నాయని, దవాఖాన భవనంతోపాటు, మంచి ల్యాబ్, మందులు, టెక్నీషియన్ పోస్టులు మంజూరు చేయడంతో వీలైనంత వరకు కాలనీలోనే వైద్యసేవలందిస్తున్నట్లు చెబుతున్నారు. జగిత్యాల, కరీంనగర్కు రెఫర్ చేసే కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుందని, బస్తీ, పల్లె దవాఖానలతో ప్రజలకు వైద్యం మరింత చేరువైందని స్పష్టం చేస్తున్నారు.
కష్టకాలంల సీఎంఆర్ఎఫ్ ఆదుకున్నది
నాకు 2021ల కరోనా పాజిటివ్ వచ్చింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానల చేరిన. సుమారు రూ.3.50 లక్షల దాకా ఖర్చైంది. కోలుకున్నంక బిల్లులతోటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న. రూ.1.02 లక్షల సాయం వచ్చింది. ఈ చెక్కును స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన్రు. ఈ సాయం నాకు చాలా సాయపడింది. కరోనా టైంల పైసలకు చానా తిప్పలైంది. అప్పు కూడా పుట్టని సమయమది. అలాంటిది అప్పోసప్పో జేసి చికిత్స పొందిన. మల్ల అప్పు ఎట్లగట్టుడు అని రందిపడ్డ. కానీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా నాకు సాయం అందింది. చానా గొప్పగా ఆదుకున్నది. వచ్చిన పైసలతోటి కొన్ని అప్పులు కట్టిన, కష్ట కాలంల సాయం అందడం అదృష్టంగా భావిస్తున్న.
-జటంగుల రవి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుడు, కానంపల్లి, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా
పైసా ఖర్చులేకుండా ఆపరేషన్ చేసిన్రు
నాకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు భాస్కర్, బాల్రెడ్డి, కూతురు భారతి ఉన్నరు. చిన్నగా వ్యవసాయం చేస్తున్రు. 60 ఏండ్ల పైబడ్డ నాకు మోకాలు నొప్పి లేసింది. ఎములాడలో ప్రైవేటు దవాఖానకు పోయి చూయించుకున్న. డాక్టర్ ఎన్ని మందులిచ్చినా తక్కువ కాలే. ఆపరేషన్ చేయించుకుంటే తగ్గుతుందన్నడు. రూ. 2 లక్షలు ఖర్చయితదని చెప్పిండు. గన్ని పైసలు నాదగ్గర లేకపాయె. జన్మలో మోకాలు నొప్పి పోదనుకున్న. ఇంతల్నే సర్కారు దవాఖాన డాక్టర్ మహేశ్రావును కలిసిన. బాధ పడకు సర్కారు దవఖానలో చేయిస్త మంచిగైతదని అన్నడు. సరేనన్న. మస్తు మంది డాక్టర్లచ్చి కాలుకు ఆపరేషన్ చేసిన్రు. నెలరోజులకు మంచిగైంది. అప్పుడు స్టాండ్ పట్టుకుని ఇంట్లోనే నడిచిన. ఆపరేషన్ మంచిగ చేసిన్రు. ఇప్పుడు స్టాండ్ లేకుండ పొలం కాడికి పోతున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల, మహేశ్సార్ జెయ్యవట్టి పైసా ఖర్చు లేకుంట నా కాలు మంచిగైంది. నన్ను చూసినోళ్లంత పరేశాన్ అయితన్రు. కుంటుకుంటూ నడిసేటోడు గింత మంచిగనడుత్తుండని ఆశ్చర్యపోతున్రు. సర్కారు దవాఖానల మంచిగ జేత్తన్నరు. నా కాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ దేవుళ్లను రోజు యాజ్జేసుకుంట దండం పెట్టుకుంటున్న.
– కదిరె భూంరెడ్డి, నిమ్మపల్లి గ్రామం, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల