హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడులు చేసే సంస్కృతిని తీసుకువచ్చిన ఆ పార్టీకి అదే తీరులో సమాధానం చెబుతామంటూ స్పష్టం చేసింది. అంతే కాకుండా, నగరంలోని బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నించింది. ఇంట్లోకి చొచ్చుకునిపోయేందుకు పరుగులు తీస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కవిత ఇంటిపై దాడిని మంత్రి గంగుల కమలాకర్తోపాటు, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 23: జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడిపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్ బీజేపీ నాయకులారా అంటూ కరీంగనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దాడులు చేసే సంస్కృతిని తీసుకువచ్చిన బీజేపీకి అదే తీరులో సమాధానం ఇస్తామని హెచ్చ రించారు. ఈ సందర్భంగా మేయర్ వై.సునీల్రావు మాట్లాడుతూ పదవుల కోసం చెప్పులు మోసే సంసృతి బీజేపీదని ఎద్దేవాచేశారు. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖడిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. దాడులకు పాల్పడడం, ఆస్తులను ధ్వంసం చేయడం బీజేపీ ఎజెండాగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సంసృతి అది కాదని, తెలంగాణ అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఇది నచ్చని కొంత మంది దుర్మార్గులు బీజేపీ రూపంలో ప్రజల్లోకి వచ్చి చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్టాలను పాలిస్తున్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు పోరాటం కొత్త కాదని, 14 ఏళ్లు శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేసే దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఉంటూ ప్రజల మెప్పు పొందాలని హితవు పలికారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల మద్దతుతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, ఐలేందర్యాదవ్, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, గందె మాధవి, జయశ్రీ, నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్గౌడ్, రాములు, హరీశ్, ఎడ్ల అశోక్, ప్రహ్లాద్, శంకర్, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్, వెంకట్ పాల్గొన్నారు.
బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నం
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నేతల దాడులకు నిరసనగా కరీంనగర్లో బండి సంజయ్ ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ నాయకులు యత్నించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంట్లోకి చొచ్చుకునేపోయేందుకు పరుగులు తీస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారనుండడంతో వెంటనే అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.