రాజన్నసిరిసిల్ల, జూలై 20: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ ముఖ్యనాయకుల సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ సూచనతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలోకి యువత చేరికపై దృష్టిపెట్టాలని కోరారు. బూత్ కమిటీల ఏర్పాటు ప్రక్రియలో వేగంపెంచి పూర్తి చేయాలని సూచించారు. అందరూ పనిచేస్తేనే పార్టీకి నూతనోత్తేజం వస్తుందన్నారు.
ప్రభు త్వ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తలు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారి దుర్మార్గాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతున్నదని అన్నారు. అనంతరం పార్టీ బలోపేతంతో పాటు నూతన చేరికలు, తదితర సమస్యల పరిష్కారంపై పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు అభిప్రాయాలు వెల్లడించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవితో పాటు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.