టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన కుట్రలపై గులాబీ దళం భగ్గుమన్నది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడంపై సర్వత్రా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. కాషాయ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను ఎండగడుతూ గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపింది. అంతటా రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించి, బీజేపీ, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసింది. ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నినదించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం, మానకొండూర్ మండలకేంద్రంలో కాషాయనేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. సంయమనం పాటించింది. కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మంథనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, కోనరావుపేటలో సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మిగతాచోట్ల జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొని, బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ గడ్డపై కుట్రలకు తావులేదని, కమలం నేతల ఆటలు ఇక్కడ సాగవని స్పష్టం చేశారు. ఎన్నో రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రభుత్వాలను కూల్చినట్టే ఇక్కడా చేస్తామంటే ఊరుకోమని, ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
మంథని: మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మధూకర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు
రాజన్న సిరిసిల్ల: మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు
కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చేసిన కుట్రలను నిరసిస్తూ గురువారం జిల్లాలో గులాబీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అన్ని మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ, బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి తదితర అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి రాస్తారోకో చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఉద్యమ గడ్డ తెలంగాణపై ఆ పార్టీ ఆటలు సాగవని నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలు చేతబూని కదం తొక్కారు.
బీజేపీకీ, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళనలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, బీజేపీ నాయకులపై తీవ్రంగా మండి పడ్డారు. సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికే 8 రాష్ర్టాల ప్రభుత్వాలను అడ్డదారిలో కూల్చిన బీజేపీ ఆటలు తెలంగాణలో, కేసీఆర్ అడ్డాలో సాగవని స్పష్టం చేశారు. చొప్పదండి మండలం చాకుంట ఎక్స్ రోడ్ వద్ద పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరి రాస్తారోకో చేశారు. మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. గంగాధర మండలం మధురానగర్ చౌరాస్తాలో కూడా నిరసన వ్యక్తం చేశారు. గన్నేరువరం, శంకరపట్నం మండల కేంద్రాల్లో కూడా నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దిష్టి బొమ్మలు దహనం చేశారు. హు జూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్తోపాటు మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు పాల్గొ న్నారు. అనంతరం బీజేపీ నా యకులు కూడా ఇక్కడ పోటీ గా నిరసన వ్యక్తం చేశారు. వీణవంకలో నిరసన వ్యక్తం చేశారు.
నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చినట్లుగా దేశంలోని ఆ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నరు. వారి ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టి టీ(బీ)ఆర్ఎస్ ఎమ్మెల్యేలు చరిత్ర సృష్టించారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను కాషాయం నేతలు మానుకోవాలి. డబ్బుల రాజకీయం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు
సీఎం కేసీఆర్కు దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఓటమి భయంతోనే ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తోంది. కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూస్తే అమ్ముడుపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వారు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు లొంగరని ఇప్పటికైనా తెలుసుకోవాలి. దేశ రాజకీయాలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్కూడా రాదు.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
బీజేపీ భయపడుతున్నది
తెలంగాణ పథకాలను చూసి బీజేపీ భయపడుతున్నది. ఎలాగైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటు. ఈ ఘటనతో బీజేపీ నీచ రాజకీయాలు బట్టబయలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితో మునుగోడు ఎన్నికలో ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకుంది. బీజేపీని నమ్మి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ను డైరెక్ట్గా ఢీకొట్టడం సాధ్యంకాదనే ఇలాంటి ప్రలోభాలకు తెరతీసి అడ్డంగా దొరికిపోయింది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే