కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తల దండు తరలివచ్చింది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పి కొట్టడం, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం, యువతను పార్టీలో విస్తృతంగా చేర్పించడంపై మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తోపాటు ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యనేతల ప్రసంగాలతో కార్యకర్తలు నూతనోత్తేజాన్ని నింపారు.
కరీంనగర్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : కార్యకర్తలు లేనిదే తాము లేమని, తానిప్పుడు మంత్రిగా మాట్లాడడం లేదని, ఒక కార్యకర్తగానే మాట్లాడుతున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని, అన్ని పార్టీలు ఏకమై తమపై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఆవిర్భవించిన టీఆర్ఎస్ అనే ఆయుధంతో కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని, ప్రజలు అందించిన అధికారంతో ఇప్పుడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తున్న దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోనే మరో ఆయుధాన్ని కోరుకుంటున్నారని అదే బీఆర్ఎస్ ఆవిర్భావమని చెప్పారు.
కార్యకర్తలు పార్టీకి అండగా ఉండి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా అడుగులు వేయాలని కోరారు. మంత్రులుగా ఉన్న తమపై రాళ్లు వేస్తున్నారని, బురద జల్లుతున్నారని, మనం వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, మనం ప్రజలకు జవాబుదారులమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మన పాత్ర మనం నిర్వహించి రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం రాకముందు పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు వివరించాలని కోరారు. స్వాతంత్య్ర వచ్చిన ఇన్నాళ్లకు మనం అభివృద్ధి చెందామని, ఇప్పుడు రాష్ర్టానికి అనేక కంపెనీలు పోటీ పడి వస్తున్నాయని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిని సాధించి పచ్చబడిన తర్వాత మళ్లీ ఆంధ్రోళ్ల నుంచి ముప్పు కనిపిస్తున్నదని, రాష్ర్టాన్ని దోచుకునేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారని, కొందరు పాదయాత్రలు చేస్తున్నారని, వైఎస్ షర్మిల, కేఏ పాల్ వీళ్లంతా ఎవరని, వేరేవాళ్ల చేతికి అధికారంపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం వేరేవాళ్ల చేతికిపోతే ఢిల్లీ చేతికి తెలంగాణ వెళ్తుందన్నారు. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం వచ్చేదా?, నీళ్లు, నిధులు వచ్చేవా?, నియామకాలు జరిగేవా? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇష్టంతోనో, కష్టంతోనో పనిచేయలేదని, కసితో పనిచేసి విజయాన్ని ముద్దాడగలిగామని గుర్తు చేశారు. ఆ కసి, పట్టుదల వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తలో కనిపించాలన్నారు. కార్యకర్తల రక్షణే తమ ధ్యేయమని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. దాడులు చేయడం మన ఉద్దేశం కాకపోయినా ప్రతిపక్ష పార్టీలు చేసే దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్పై దాడులకు తెగబడుతున్నాయని, ఇందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై జరిగిన దాడే నిదర్శనమని చెప్పారు. అవకాశాలు అందరికీ వస్తాయని, ఓపికతో వేచి ఉండాలని కార్యకర్తలను కోరారు. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం ఉందని, పార్టీ తనకేమిచ్చిందని కాకుండా పార్టీకి తానేమిచ్చానని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మనదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి మూన్నెళ్లకోసారి విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని భావించరాదని, ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తూ దీటుగా ఎదుర్కోవాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని, ఎల్ఐసీ వంటి సంస్థలను అమ్మజూస్తున్నదని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ గతంలోనే ప్రారంభమైనా కేవలం రాజకీయ వేదిక కోసమే మరోసారి ప్రధాని ప్రారంభించారని ధ్వజమెత్తారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా మాత్రమే ఉన్నదని, తామెలా విక్రయిస్తామని ప్రధాని మోదీ చెప్పిన అబద్దాలను తాను ఖండించానని, వాటిని నిరూపిస్తూ ప్రెస్మీట్ పెట్టానని చెప్పారు. ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ అంటే టీఆర్ఎస్ నాయకులకు తెలియదని, తనకే పాఠాలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సింగరేణిని చంపాలని కేంద్రం చూస్తున్న మాట నిజమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తున్నదని విషప్రచారం జరుగుతున్నదని, నిజానికి తెచ్చిన అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు సమకూర్చుతున్నది తప్పితే ఉద్యోగుల జీతాలకో, సంక్షేమ పథకాలకో ఉపయోగించడం లేదని వివరించారు. దీనిని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అరాచకాలు జరుగుతున్నాయని, మత కల్లోలాలకు ఆ పార్టీ కేంద్రంగా మారిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులంతా కాంగ్రెస్ వాళ్లని గుర్తు చేశారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదని, హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓట్లు వేయించుకుని బీజేపీ గెలిచిందని, మునుగోడులో అభ్యర్థి ఆయన కాకపోతే పది వేల ఓట్లు కూడా వచ్చేవి కావన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్జోడా యాత్రపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఆయన కాంగ్రెస్ జోడో చేస్తే బాగుంటుందని సూచించారు. గుజరాత్లో 25 ఏండ్ల కింద అధికారం కోల్పోయిన కాంగ్రెస్ను బతికించుకోవాలనే ఆలోచన చేయలేదని, ఆ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర లేక పోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.
– గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి
ఒక మంత్రిగా కాదు, ఒక కార్యకర్తగా చెబుతున్న. మీరు లేక పోతే మేము లేం. మాకు కులం లేదు, మతం లేదు. అన్నీ మీరే. కుటుంబంలో ఎన్నో లోటుపాట్లు ఉంటయి. రాజకీయ పార్టీలు అందుకు అతీతంకాదు. కానీ, అదే కుటుంబంపై ఎవరైనా దాడిచేస్తే ఆ కుటుంబ సభ్యులు ఊరుకోరు. మన పార్టీపై దాడిచేస్తే మనం ఊరుకుంటమా..? అలాంటి వారిని తిప్పికొట్టి టీఆర్ఎస్ను బలోపేతం చేయాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ర్టానికి భవిష్యత్తు ఉన్నది. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తున్న దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మరో ఆయుధాన్ని కోరుకుంటున్నరు. అదే బీఆర్ఎస్ ఆవిర్భావం. కార్యకర్తలు పార్టీకి అండగా ఉండి దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేదిశగా అడుగులు వేయాలి.
సైనికుల్లా కదలాలి..
రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతున్నదంటూ బీజేపీ, కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నయి. కానీ, బీజేపీలోనే 25 మంది నాయకులు వారసత్వ రాజకీయాలు చేస్తున్నరు. ఆ నాయకుల పేర్లు మీకు చెబుతున్న. ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. నేను చెప్పిన తర్వాత కూడా బండి సంజయ్, ఈటల రాజేందర్ కుటుంబ పాలన అని మాట్లాడితే తగిన బుద్ధి చెప్పక తప్పదు. బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడుదాం. మతతత్వ ఎజెండాతో ముందుకొస్తున్న ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమి కొడుదాం. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అడ్డా అని నిరూపిద్దాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం, అవసరం వచ్చినా మేం ఉన్నం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. సైనికుల్లా ముందుకు కదలండి.
– జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ మనకు అవసరం
కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిండు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అంత అనుభవమున్న ఆయన మనకే కాదు మన దేశానికి కూడా అవసరం. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నరు. పింఛన్లు, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తం కావాలని ఆకాంక్షిస్తున్నరు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్ వస్తుంది.. అదే బీజేపీ వస్తే కరెంట్ మోటర్లకు మీటర్లు పెడుతరు. ఇలాంటి విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. బీజేపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టకపోతే నష్టపోతం. అబద్ధాలు ప్రచారం చేసే బీజేపీ నాయకులను ఊళ్లలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు.
– పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ
దేశానికి రోల్మోడల్..
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచీగా నిలిచింది. కేసీఆర్ దార్శనికతే అందుకు కారణం. బీజేపీ అంటే కులతత్వ, మత తత్వ పార్టీ. అన్ని వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ. కేంద్రంలో కొనసాగుతున్నది ప్రధాని మోడీ ప్రభుత్వం కాదు, అదానీ, అంబానీ ప్రభుత్వం. బీజేపీ యువతలో విష బీజాలు నాటుతున్నది. అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీనే. కేసీఆరే రాష్ర్టానికి, దేశానికి శ్రీరామరక్ష. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటం. మనందరం గులాబీ సైనికుల్లా వచ్చే ఎన్నికల్లో కష్టపడాలి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి. టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్వీ, యూత్ వింగ్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకోవాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
వీరసైనికుల్లా పనిచేయాలి
తెలంగాణ ఏర్పడిన కొన్నేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రగతి సాధించుకున్నాం. ఈ ప్రగతిని మనం పొగుడుకోవడం కాదు. ప్రజలకు వివరంగా చెప్పాలి. అపుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఏమి ఇవ్వని వాడే ఎగిరెగిరి పడుతున్నడు. అన్నీ ఇచ్చిన మనం అనుకువగా ప్రజల్లోకి వెళ్లాలి. మళ్లీ అధికారంలోకి రావాలంటే మనలో స్ఫూర్తి రగలాలి. కార్యకర్తలే టీఆర్ఎస్కు ఆయుధాలు. 2023లో మళ్లీ అధికారంలోకి తెచ్చి వీర సైనికుల్లా పనిచేయాలి. కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తాం. కాళేశ్వరం నీళ్లు ఎదురెక్కుతాయని, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాలకు వస్తాయని ఎవరైనా ఊహించారా..? ఇదంతా కల అనుకున్నవాళ్లు నిజంగా ప్రత్యక్షమైతే ఓర్వలేక పోతున్నరు. ఇదే విషయాన్ని ప్రజల్లో చెప్పాలి. కాళేశ్వరంతో ఎండిన పొలాలకు నీళ్లు వచ్చాయనే సంగతి ప్రజలకు తెలియజేయాలి. కార్యకర్తల సేవలకు వెలకట్ట లేం. బీజేపీ ఏ ఊళ్లో ఉన్నది? గుడ్డిలో మెల్లలా మనం చేసిన చిన్న పొరపాటు వల్ల ఒకట్రెండు చోట్ల తప్పు జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు గోబెల్ ప్రచారం చేస్తున్నరు. ‘అభివృద్ధి చేస్తం. అడ్డు వస్తే తొక్కుతం. అభివృద్ధి చేయని రోజు వెనక్కి తిరిగి వెళ్లి పోతం’ ఇదే నినాదంతో ముందుకు వెళ్లాలి. – రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
చైతన్యవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలి. ఒక్కో పథకం కింద లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి వారిని తప్పకుండా కలవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారు ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మంది ఉంటరు. వారిని చైతన్యవంతం చేయాలి. ముఖ్యంగా దళితబంధు వంటి పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
కలిసికట్టుగా పనిచేయాలి
కార్యకర్తలు కలిసికట్టుగా ఉండాలి. బీజేపీ కుతంత్రాలను ఎదుర్కోవాలి. మన ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఇతర పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతున్నయి. అందుకే ఆ పార్టీలు మనపై కుట్రలు చేస్తున్నయి. వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలి. వచ్చే ఎన్నికల్లో మనమంతా ఘన విజయం సాధించి, మూడో సారి అధికారంలోకి రావాలి. జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గం, మండల స్థాయిల్లో కూడా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలి.
– కనుమల్ల విజయ, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్
బీజేపీ దేశానికి చేసిందేమీ లేదు
వచ్చే ఎన్నికల్లో టార్గెట్ బీజేపీ, అటాక్ బీజేపీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలి. బీజేపీ ఒక అబద్ధాల పార్టీ, ఒక బూటకపు పార్టీ. మతాన్ని నమ్ముకుని విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. రాజకీయ హిందూత్వమే వీళ్ల నినాదం. వీళ్లు దేశానికి చేసింది ఏమీ లేదు. దేశంలో ఉన్న సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయాలని, ఒకే సంస్కృతిని తేవాలని కుట్రలు చేస్తున్నరు. మత పరమైన విషం చిమ్ముతూ విద్వేషాలు రగిలిస్తున్నరు. బీజేపీ బట్టేబాజ్, బజారు మాటలతో యువత మోసపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. అవసరమైతే యువతకు రాజకీయ శిక్షణ తరగతుల నిర్వహించాలి.
– నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కార్యకర్తలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమంపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలకు వివరించి ఏది నిజమో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి. – వై సునీల్ రావు, కరీంనగర్ మేయర్
బండి సంజయ్ ఒక్క పైసా తెచ్చినవా..?
గొప్ప పథకాలన్నీ మన రాష్ట్రంలో అమలవుతున్నయి. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వమే అవసరమని ప్రజలు నమ్ముతున్నరు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కపైసానైనా ఇచ్చిందా..? ఎంపీ గా ఉన్న బండి సంజయ్ కనీసం ఒక్క పైసానన్నా తెచ్చి అభివృద్ధి చేసిండా..? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అనేక బిల్లుల రూపంలో కేంద్రం అడ్డుకుంటున్నది. ఇది ఎంత వరకు కరెక్టో ప్రజలకు వివరించాలి.
– గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ ఇన్చార్జి
కష్టపడితేనే గుర్తింపు..
కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. టీఆర్ఎస్లో కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉన్నది. ఒక్కో కార్యకర్త ఒక్కో ఉద్యమ నేత. భవిష్యత్తులో కష్టపడితే మరింత గుర్తింపు వస్తుంది. రాష్ట్రం సాధించుకున్న నిధులు, నీళ్లు, నియామకాల గురించి ప్రజలకు వివరించాలి. రైతుబంధు, రైతుబీమా పథకాలను రైతులకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరించాలి.
– పెండ్యాల భూపతిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
మనిషి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్
రాష్ట్రం రాకముందు ఎక్కడచూసినా సమస్యలే. అప్పుడు ప్రజలు తమ కష్టాలు తప్పించమని తరచూ దేవున్ని కోరుకునే వాళ్లు. కా నీ, రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ దేవుడిరూపంలో వచ్చి అన్ని సమస్యలను పరిష్కరించిన్రు. తమ కష్టాలు తీరాలని మొక్కుకున్న రైతులకు నీళ్లు, ఫ్రీ కరెంట్, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ఇచ్చిండు. తాగునీటి కోసం అష్టకష్టాలు పడిన మహిళలకు మిషన్ భగీరథ రూపంలో ఇంటి ముందుకే నీళ్లు తెచ్చిండు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్కిట్లు ఇలా అనేకపథకాలు అందించి అన్నివర్గాల కష్టాలు తీర్చిండు.
– శ్రీరాం మధుకర్, ఎంపీపీ , గంగాధర
గడపగడపకూ తీసుకెళ్లాలి
టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి. ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలుపు మన దే. గత ఎంపీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్కసారి కూడా మా మానకొండూర్ నియోజకవర్గానికి రాలేదు. అభివృద్ధి కోసం ఒక్కపైసా తేలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తరు?
– తాళ్లపల్లి శేఖర్ గౌడ్, జడ్పీటీసీ, మానకొండూర్