ముత్తారం, ఏప్రిల్ 9 : అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ముత్తారం మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఇష్టారీతిన నరికివేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా వేబ్రిడ్జి నిర్మాణం ప్రారంభించడమే కాకుండా, దానికి అడ్డుగా ఉన్నాయని సుమారు 30 చెట్లను తొలగించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రైతులకు అవసనరమైతే లైన్క్లియర్ (ఎల్సీ) ఇవ్వని విద్యుత్ శాఖ అధికారులు.
ఎలాంటి పర్మిషన్ లేకుండా చెట్లను తొలగించడానికి మాత్రం ఏకంగా 30 నుంచి 40 నిమిషాలు కరెంట్ సరఫరా నిలిపివేసినట్లు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు పెంచగా, ఇలా కొందరు ఇష్టారాజ్యంగా నరకడంపై ప్రకృతి ప్రేమికులు, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాగా, వేబ్రిడ్జి నిర్మాణంపై ముత్తారం గ్రామ కార్యదర్శి సంతోష్ను ఫోన్ ద్వారా సంప్రదించగా తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. తాము పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఇటు అటవీ అధికారులు స్పష్టం చేశారు.