యువత కలల సాకారానికి ఎప్పటికప్పుడు వేలాది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తున్న రాష్ట్ర సర్కారు, నియామకాల్లోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ఏర్పాటు చేసి అత్యంత పకడ్బందీగా రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.32 లక్షల కొలువులు భర్తీ చేస్తే.. అందులో 37 వేలు టీఎస్పీఎస్సీ భర్తీ చేసినవే కాగా, మన ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమందికి కొలువులు దక్కాయి. అందులో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికే జాబ్స్ రావడం చూస్తే కొలువుల భర్తీ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు చేసిన లీకేజీ వ్యవహారాన్ని సర్కారుకు అంటగట్టి బద్నాం చేసేందుకు కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలతో నిరుద్యోగుల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో కొలువులు సాధించిన ఉద్యోగులు ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నదని, కష్టాన్ని నమ్ముకున్నోళ్లకే జాబ్స్ వస్తాయని, టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ పద్ధతిని చూస్తే ఇది అర్థమవుతుందని, అందుకు తామే ఉదాహరణని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహ పడొద్దని, మీ ప్రయత్నాలను కొనసాగించాలని సూచిస్తున్నారు.
మేం మీతో ఉన్నాం.. ఆందోళన వద్దు
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీ మేలు కోరే ప్రభుత్వం. మీ ప్రయోజనాల కోసం, ఉపాధి కోసం నిర్విరామంగా పని చేసే ప్రభుత్వం. మేం మీతో ఉన్నాం. ఆందోళన వద్దు. ఒక పరీక్ష రద్దయితే అభ్యర్థులు అనుభవించే బాధ నాకు తెలుసు. వీలైనంత త్వరగా మళ్లీ నిర్వహిస్తాం. అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసిన వారంతా మళ్లీ పరీక్ష రాయొచ్చు. స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతాం. పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. లీకేజీ వెనుక ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
– మంత్రి కేటీఆర్
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ర్టాన్ని సాధించి, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తొమ్మిదేండ్ల వ్యవధిలోనే అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. కొన్నేళ్లుగా నియామకాలపై దృష్టిపెట్టింది. ఇంకా స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు జోనల్ వ్యవస్థలోనూ మార్పులు చేయడంతోపాటు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ను ఏర్పాటు చేసింది.
టీఎస్పీఎస్సీ అత్యంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నది. నాడు సమైక్య రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మీద అనేక ఆరోపణలు వచ్చేవి. కానీ, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎనిమిదేండ్లలో 150 నోటిఫికేషన్లు వేసి 37 వేల కొలువులు భర్తీ చేసింది. మొత్తంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1.32 లక్షల కొలువులు భర్తీ కాగా, దాదాపు మరో లక్ష ఉద్యోగాల భర్తీకి విడుతల వారీగా నోటిఫికేషన్లు వేస్తున్నది. గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఈ, తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి కొలువులు రాగా, మరెంతో మంది పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పకడ్బందీగా జరుగుతున్న కొలువులు భర్తీని చూసి ఎంతో మంది ధీమాగా జాబ్స్కు ట్రై చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు చేసిన పని వల్ల ఏఈ ప్రశ్న పత్రం పేపర్ లీక్ కాగా, ఆ తప్పిదాన్ని కొందరు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్వరాష్ట్రంలో కొలువులు సాధించిన యువకులంతా మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అంత్యత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నదని, పైరవీలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకే జాబ్స్ వస్తాయని, టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ పద్ధతిని చూస్తే అది అర్థమవుతుందని, అందుకు తామే ఉదాహరణని చెబుతున్నారు. ఇక్కడి ఎంపిక విధానాన్ని అధ్యయనం చేసి ఆయా రాష్ర్టాల్లో అమలు చేయడానికి 13 రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు ప్రయత్నాలు చేస్తున్నారంటేనే మన కమిషన్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు కొందరు చేసిన తప్పిదాన్ని భూతద్దంలో చూపడం, వ్యవస్థనే తప్పుబట్టడం సరికాదంటున్నారు. రద్దయిన పరీక్షలు త్వరలోనే ఉంటాయని, దరఖాస్తు చేసిన వారంతా మళ్లీ పరీక్ష రాయొచ్చని, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులంతా ఆందోళన చెందవని సూచిస్తున్నారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతుందని చెప్పారు. పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, రాజకీయ నిరుద్యోగులు, బేహారీలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని యువతకు సూచించారు.
వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించద్దు
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో కొందరు వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కష్టపడి చదివి 4 జాబ్స్ సాధించా. మాది వ్యవసాయ కుటుంబం, ఎంసీఏ చేశా. 2014 నుంచి పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇంటి వద్ద నుంచే ప్రిపేరై, గ్రూప్ -2, జేపీఎస్, వీఆర్వో, గ్రూప్ -4 ఎగ్జామ్స్ రాసి కొలువులు సాధించా. జేపీఎస్లో సిద్దిపేట జిల్లా టాపర్గా నిలిచా. గ్రూప్ -2లో స్టేట్లో 32వ ర్యాంక్ సాధించి 2019 మున్సిపల్ కమిషనర్ కొలువు కొట్టా.
పరీక్షలు పారదర్శకంగా జరగడం వల్లే నేను 4 ఉద్యోగాలు సాధించా. ప్రస్తుతం పెద్దపల్లి బల్దియాలో పని చేస్తున్నా. నేను కూడా ఇటీవల నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యా. గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేశారని అర్హత సాధించిన అభ్యర్థులు అధైర్య పడొద్దు. నేను జాబ్ సాధిస్తా అనే ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ఒక వేళ ప్రశ్నాపత్రాలు లీక్ అయినా పరీక్షలు రద్దు చేయకుంటే అనర్హులకు జాబ్లు వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి కష్టపడి చదివే అభ్యర్థులు అధైర్యపడకుండా మరో చాన్స్ వచ్చిందనుకొని పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో దోషులను చట్ట ప్రకారం శిక్షించాలి.
– మట్ట శ్రీనివాస్రెడ్డి, బల్దియా కమిషనర్(పెద్దపల్లి)
మళ్లీ గ్రూప్-1 రాస్తా.. ఉద్యోగం సాధిస్తా..
మాది హుజూరాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లి. మా తల్లిదండ్రులు పోరెడ్డి రాణి, వెంకట కిషన్రెడ్డి. మాది రైతు కుటుంబం. నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. ఇంజినీరింగ్ తర్వాత పలు సాప్ట్వేర్ జాబ్స్కు చాన్స్లు వచ్చినా నచ్చలేదు. ఇంటికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. కొద్ది రోజులు ఇంటి వద్దనే పార్ట్టైం జాబ్ కూడా చేశా. గ్రూప్-2తో పాటు పలు ఉద్యోగాలకు ప్రిపేరయ్యా. రాష్ట్ర ప్రభుత్వం 2018లో నోటిఫికేషన్ ఇవ్వగానే ఎలాగైనా జాబ్ సాధించాలని ఇంటి దగ్గరే ఉండి కష్టపడి చదివా. సిలబస్కు అనుగుణంగా పుస్తకాలను సేకరించుకుని రోజుకు సుమారు 8 గంటల పాటు చదివా. 2020లో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం సాధించా. ప్రస్తుతం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో పనిచేస్తున్న. టీఎస్పీఎస్సీ పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించడం వల్లే నేను ఈ ఉద్యోగం సాధించిన. టీఎస్పీఎస్సీపై నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి నేను మెయిన్కు సెలెక్టయిన. గ్రూప్-1 ఉద్యోగం కొట్టాలని పట్టుదలతో చదువుతున్న. ఇంతలోనే ఇలా జరిగింది. అయినా, నా అత్మైస్థెర్యం కోల్పోవడం లేదు. మళ్లీ పరీక్ష రాస్తా. ప్రిలిమ్స్ పాసైతననే నమ్మకం ఉన్నది. సమర్థుడు ఎప్పుడు పరీక్ష పెట్టినా ఎదుర్కొంటడు. ఆ విశ్వాసం నాకుంది. నేను పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు నా ప్రతిభనే కారణం. ఎక్కడ కూడా లంచాల మాట వినిపించింది లేదు. ఇప్పుడు గ్రూప్-1 కూడా నా ప్రతిభతోనే సాధిస్తా.
– పోరెడ్డి నరేందర్రెడ్డి, వెన్నంపల్లి పంచాయతీ కార్యదర్శి
పారదర్శకత లేకుంటే ఉద్యోగం వచ్చేదే కాదు
మాది హుజూరాబాద్. నిరుపేద కుటుంబం. మానాన్న ఎంతో కష్టపడి చదివి టీచర్ అయ్యారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివా. 2018 సంవత్సరంలో కేయూలో పీజీ సీటొచ్చింది. ఇతర కారణాల వల్ల చేరలేకపోయా. ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యా. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. రోజుకు నాలుగైదు గంటలు చదువుకొని పరీక్ష రాసిన. మంచి ర్యాంకొచ్చింది. పోటీ పరీక్ష తర్వాత జాగృతి కళాశాలలో పీజీ పూర్తి చేశా. 2020 జూలైలో మానకొండూర్ మండలం పోచంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరా. ఇప్పుడు జమ్మికుంట మండలం మాచనపల్లిలో విధులు నిర్వహిస్తున్న. టీఎస్పీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరించకుంటే నాలాంటోళ్లకు ఉద్యోగాలే వచ్చేవి కాదు. మాకు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. నన్ను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబెట్టింది టీఎస్పీఎస్సీనే. దానిపై నమ్మకంతోనే గ్రూప్స్లో ఉద్యోగం కొట్టాలని ప్రిపేరవుతున్న. పంచాయతీ కార్యదర్శి పోటీ పరీక్షల తర్వాత పీజీ కూడా చేసిన. మొన్న గ్రూప్స్కు ఫీజు కట్టిన. కానీ, పరీక్ష రాయలేక పోయిన. ఇప్పుడు రద్దయ్యింది. మళ్లీ నాకు అవకాశం వచ్చినట్లే అనుకుంటున్న. ఇప్పుడు తప్పకుండా గ్రూప్-1 పరీక్షకు హాజరవుతా. కష్టపడితే ఏదో ఒక పెద్ద ఉద్యోగం వస్తుందననే నమ్మకం ఉన్నది.
– గప్పెట శివరంజని, పంచాయతీ కార్యదర్శి
అక్రమాలు అబద్ధం
మాది రాయికల్ మండలం ఇటిక్యాల. మానాన్న జనార్దన్ బతుకుదెరువుకు దుబాయ్కి వెళ్లాడు. కష్టపడి చదివించా డు. 10వ తరగతి ఇటిక్యాల, ఇంటర్ రాయికల్, కరీంనగర్లో డిగ్రీ పూర్తి చేసిన. ఓయూలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్ పూర్తి చేసిన. మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్న. 2016 ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే ప్రిపరేషన్ను మొదలు పెట్టిన. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు. నాణ్యమైన మెటీరియల్ సేకరించి సొంతంగా నోట్స్ తయారు చేసుకొని ఇంటివద్దే ప్రిపరేషన్ కొనసాగించిన. పరీక్ష అనుకున్నట్టుగానే బాగా రాసిన. ఆ తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నో టి ఫికేషన్ వచ్చింది. బాగా చదివి పరీక్ష రాసిన. తదనంతరం హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు సిద్ధమవుతుండగానే 2019లో పంచాయితీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైన. మా ఊరి సమీపంలోని మల్లాపూర్లో కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. కార్యదర్శిగా పనిచేస్తూనే ఖాళీ స మయంలో ఈ పరీక్షకు ప్రిపేరైన. ఇంతలోనే 2020లో గ్రూ ప్ 2 ఫలితాలను ప్రకటించారు. మంచి ర్యాంకు ప్రకా రం నా కు అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జాబ్ వ చ్చిం ది. మంచిర్యాలలో పోస్టింగ్ వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ ఫలితాలు ప్రకటించగా అందులోనూ విజ యం సా ధించిన. ఆ తర్వాత కొద్దిరోజులు కాగానే గ్రూప్ 4 ఫలితాలు ప్రకటించగా ఉద్యోగం వచ్చింది. అయితే గ్రూప్-2 సర్వీసు హోదాకలిగిన ఉద్యోగం కావడంతో అందులోనే కొనసాగుతున్న. టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ ఏజెన్సీలు పకడ్బందీగా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం వల్లే నాకు నా లుగు ఉద్యోగాలు వచ్చినయ్. మేము రాసిన పోటీ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల రూపకల్పన అంతా సవ్యంగానే ఉన్నది.
ఏమాత్రం గందరగోళానికి అవకాశం లేకుండే. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ పకడ్బందీగా జరుగుతుంది. అక్రమాలు జరుగుతున్నాయని, ఉద్యోగాలు అమ్ముకుంటారనేది అబద్ధం, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల పేపర్లు లీక్ చేసి జాబ్స్ కొల్లగొడుతున్నారని కొందరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉద్యోగాల భర్తీ సంస్థల్లో అంతటి అవినీతి ఉంటే సాధారణ కుటుంబానికి చెందిన నాకు నాలుగు ఉద్యోగాలు ఎలా వచ్చినయ్. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపి నిరుద్యోగులను గందరగోళానికి గురిచేయవద్దు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలే. తమ రాజకీయ లబ్ధి కోసం చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేయవద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మవద్దు. ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అభ్యర్థులు నిశ్చింతగా, ఆత్మవిశ్వాసంతో ఉద్యోగాలకు సిద్ధం కావాలి.
– తూం ప్రదీప్, ఏసీటీవో, మంచిర్యాల (గ్రూప్ 2 విజేత)
రెండు ఉద్యోగాలు మెరిట్తోనే..
తెలంగాణ ప్రభుత్వం 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, జానియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగాల కోసం కరీంనగర్లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నా. శిక్షణ తీసుకోవడంతోపాటు ఇంటి వద్ద సొంతంగా ప్రిపేరయ్యా. ప్రతి రోజూ కనీసం 10 గంటలు చదివా. ప్రణాళిక ప్రకారం చదివి అన్ని సబ్జెక్టులపై అవగాహన తెచ్చుకున్నా. ఏ పరీక్షనైనా ఎదుర్కోగలుగుతాననే ధైర్యం వచ్చింది. పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ రావడంతో ఆ పరీక్ష కూడా రాసిన. 2019లో ఏప్రిల్లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్లో ఆరు నెలలు పనిచేశా. ఇదే ఏడాది టీఎస్పీఎస్సీ ఫలితాలు విడుదల కావడంతో ఏఎస్వో ఉద్యోగానికి ఎంపికయ్యా. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఎస్వోగా గంగాధర తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరా. టీఎస్పీఎస్సీలో పారదర్శకత అనేది లేకుంటే నేను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యెటోన్నేకాదు. రూపాయి లంచం లేకుండా, ఎలాంటి పైరవీ లేకుండా రెండు ఉద్యోగాలు సాధించడానికి టీఎస్పీఎస్సే కారణం. నాలా ప్రతిభ ఉన్నవాళ్లే ఎంపికవుతుంటరు. మా బ్యాచ్లో టాపర్స్ మన ఉమ్మడి జిల్లాకు చెందిన వాళ్లే ఉన్నరు. ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తే గానీ మాలాంటోళ్లకు ఉద్యోగాలు రావన్నది గట్టిగా చెప్పగల్గుత. ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు జరిగితే అభాండాలు వేయడం సరికాదు. – కనకట్ల చిన్నయ్య, ఉప్పరమల్యాల(గంగాధర)
ఇంటి వద్దనే ప్రిపేర్ అయ్యా
నా పేరు అల్లుగవెళ్లి శ్రీధర్ రెడ్డి. మాది కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామం. ఏడో తరగతి నుంచి పది వరకు జయశంకర్ భూపాలపల్లిలో, ఇంటర్ హన్మకొండలో చదివా. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశా. రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ ఉద్యోగంలో చేరాలని కోరిక. అందుకే హైదరాబాద్లో 4 నెలలు కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఇంటివద్దే ప్రిపేర్ అయ్యా. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యా. కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉంటూరు ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేరయ్యా. టీఎస్పీఎస్సీ పరీక్ష రాశా. 2018లో ఆర్ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. మంచిర్యాలలో మొదటి పోస్టింగ్ అనంతరం ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పని చేస్తున్న. ఎలాంటి పైరవీలు లేకుండా నేను ఎస్ఐని అయ్యా. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియ టీఎస్పీఎస్సీ చాలా పకడ్బందీగా నిర్వహించింది. ప్రస్తుతం కొందరు చేస్తున్న తప్పును వ్యవస్థకు ఆపాదించడం తప్పు.
– అల్గువెల్లి శ్రీధర్రెడ్డి, ఆర్ఎస్ఐ, మొట్లపల్లి, కాల్వశ్రీరాంపూర్
అన్నీ హానెస్ట్గానే జరిగినయ్..
మాది చొప్పదండి పట్టణం. 2017లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన టీజీటీ, పీజీటీ పరీక్షలకు ప్రిపేరయి రాశా. టీజీటీ తగిలింది. చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. ఇక్కడే ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న. నేను ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేరయ్యా. పిలిమినరీలో 1:15కు ఎంపికయ్యాను. మెయిన్స్కు 1:3కి కూడా ఎంపికయ్యా. మెరిట్ సాధించిన నాతోపాటు చాలా మందికి అనేక అనుమానాలు ఉండేవి. ఇంత మెరిట్ సాధించినా ఉద్యోగం వస్తుందా? లేదా? అనేది మా అనుమానం. ఎందుకంటే ఎక్కడైనా పైరవీకి తావు ఉంటుందేమోననే భయం ఉండేది. మాకు అలాంటి పరిస్థితి అస్సలు ఎదురు కాలేదు. మా బ్యాచ్ మొత్తం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఏ క్యాండిడేట్ వరకు ఎంపికవుతారనేది ఎప్పటికపుడు అంచనా వేసుకునే వాళ్లం. మా గెస్ కరెక్ట్ అయ్యింది. మేం ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయనుకున్నామో కొంచెం అటీటుగా అందరికీ వచ్చాయి. అంటే నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, హానెస్టుగా జరిగాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఉద్యోగం సాధించేందుకు నేను చాలా కష్టపడ్డా. 15 రోజులు శిక్షణ కేంద్రానికి వెళ్లి ప్రిపేరయ్యా. గవర్నమెంట్ ప్రచురించిన అకాడమిక్ పుస్తకాలతోపాటు, కోచింగ్ సెంటర్ వాళ్లు ఇచ్చిన మెటీరియల్తో రోజుకు 10 గంటలు చదివా. ఇంత కష్టపడి చదివాను కనుకే నాకు ఉద్యోగం దక్కింది. నాతోపాటు ఎంపికైన ప్రతి ఒక్కరూ తమ ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించారు. ఇలా చేస్తేనే మంచి ఉద్యోగులు ప్రభుత్వానికి దొరుకుతారు.
– యామ విజయలక్ష్మి, టీజీటీ గురుకుల పాఠశాల, చొప్పదండి
శ్రమనే నమ్ముకుని జాబ్ సాధించి..
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన కేశంపల్లి ప్రవీణ్ది నిరుపేద కుటుంబం. పార్ట్టైం జాబ్స్ చేసుకుంటూ కష్టపడి చదివి 2012లో బీటెక్ పూర్తి చేశాడు. అదే సంవత్సరం పెండ్లి చేసుకున్నాడు. అయితే ఉద్యోగం లేకపోడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులుపడ్డాడు. చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో మనో వేదనకు గురయ్యాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కొంతకాలం అరకొర జీతంతో సేల్స్మెన్గా పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం రావడం. ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సర్కారు సిద్ధం కావడంతో తిరిగి సొంతూరికి వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు. భార్య పుష్పలత కూడా ప్రోత్సహించింది. అయితే, కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక స్థోమతలేకపోవడంతో కలవరపడ్డారు. హైదరాబాద్కు వెళ్లి పార్ట్టైం జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకోవాలని అనుకున్నారు. ప్రవీణ్ దిల్షుక్ నగర్లో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం కోచింగ్కు వెళ్తూనే, ఐసీఐసీఐ ఏజెన్సీలో క్రెడిట్కార్డు రికవరీ ఏజెంట్గా చేరాడు.
ఫ్లిప్కార్ట్లో కొంతకాలం పని చేశాడు. ఇదే సమయంలో 2018 ఆగస్టు 31న జూనియర్ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఉద్యోగాలు మాని పూర్తిస్థాయిలో ప్రిపరేషన్పై దృష్టి పెట్టాడు. భార్య పుష్పలత కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ. 8 వేల వేతనంపై ఉద్యోగంలో జాయిన్ అయింది. భర్త ప్రవీణ్ ప్రిపరేషన్ కోసం తన జీతం ఇస్తానని ధైర్యం చెప్పింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి భార్యను ఉదయాన్నే ఆఫీసులో దించి వచ్చి 9 గంటల నుంచి సాయంత్రం 6వరకు పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. అయితే, కొందరు మిత్రులు అతడిని ఎగతాళి చేసేవారు. ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని చదవడం దండగని నిరుత్సాహపరిచేవారు. అయితే ప్రవీణ్ ఇలాంటి పుకార్లను నమ్మలేదు. తన లక్ష్యం కోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. పరీక్షనువిజయవంతగా రాసి పంచాయతీ సెక్రటరీ జాబ్ సాధించాడు. ‘తాను శ్రమనే నమ్ముకున్నానని, కొందరు గిట్టనివాళ్లు తప్పుడు ప్రచారం చేస్తారని, నిరుద్యోగులు పట్టించుకోవద్దు’ అని ప్రవీణ్ చెప్పాడు. ఈ ప్రభుత్వం తొమ్మిదేండ్లల్లో అన్ని జాబ్స్ను సక్రమంగానే భర్తీ చేసిందని పేర్కొన్నాడు. ఇప్పుడు జరిగిన పొరపాట్లను కొందరు అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నాడు. వీటిని నమ్మకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే కచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాడు. – ఎల్లారెడ్డిపేట, మార్చి 19
అవినీతి, అక్రమాలు జరుగలేదు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరుగలేదు. మా ప్రాంతం నుంచి దాదాపు 60 నుంచి 70 మందికి పైగా ఎస్ఐలుగా, పోలీస్ కానిస్టేబుల్స్గా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా, జూనియర్ లైన్మెన్లుగా, ఫారెస్ట్ భీట్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందాం. మేం పరీక్షలు రాసిన సమయంలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు. ఉద్యోగం సాధించేందుకు మేం పడిన శ్రమ ఆ దేవుడికే తెలియాలి. అనవసరంగా నిరుద్యోగులకు బతుకు దెరువు జూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసి మా బతుకుల్లో మట్టికొట్టే వాళ్లకు మా ఉసురు తలిగి పోతరు.
– సిరవేని లన్కుమార్, పోలీస్ కానిస్టేబుల్, (హైదరాబాద్)
(పెద్దపల్లిరూరల్)