కరీంనగర్, మే 7 (నమస్తే తెలంగాణ) ;అన్నదాతకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి కన్నీరే మిగులుతున్నది. కొనుగోళ్లలో జాప్యం చేయడంతో అపార నష్టం వాటిల్లింది. మొన్నటి దాకా సాగునీరందక.. పంటలను కాపాడుకోలేక ఆగమైతే.. ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఈదురుగాలులతో బీభత్సం సృష్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. సకాలంలో కొనకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది. అనేక చోట్ల వరదలో కొట్టుకుపోయింది. వారం పది రోజులుగా కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోస్తూ కాపాడుకున్న రైతులు, ఇప్పుడు వాన నుంచి రక్షించుకునేందుకు తిప్పులు పడ్డారు. అయినా కండ్ల ముందే ధాన్యం తడిసిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తమకీ దుస్థితి వచ్చిందని కన్నీరు పెడుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, కొనుగోళ్లలో జాప్యం జరగలేదేని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంట వెంటనే తూకం వేయకపోవడం వల్లే నష్టం జరిగిందని ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా..
జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. కొలనూర్లో జక్కుల రాజయ్యకు చెందిన ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. మంథని డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో గాలి దుమారంతో పాటు స్వల్పంగా వర్షం పడింది.
సిరిసిల్ల జిల్లా
వేములవాడ రూరల్ మండలం బొల్లారం వద్ద భారీ చెట్లు రోడ్డుపైన విరిగి పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాలిదుమారంతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో పిడుగుపాటుకు రైతు దాదె జలపతికి చెందిన గేదె చనిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వీర్నపల్లితోపాటు గర్జ నపల్లి, రంగంపేట, అడవిపదిర, కంచర్లలో వడగండ్ల వాన పడింది. కోనరావుపేట మండలంలోని కొను గోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. నాగా రంతో పాటు పలు గ్రామాలలో చేతికొచ్చే సమ యంలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరా లాయి. వట్టిమల్ల, పలు తండాలలో రాళ్ల వర్షం పడింది.
కరీంనగర్ జిల్లా..
జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ప్రధానంగా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో అకాల వర్షం ముంచింది. చొప్పదండి, గంగాధర, గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్తోపాటు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసిపోయింది. గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిస్థితిని పరిశీలించారు. శంకరపట్నం, చిగురుమామిడి మండలంలోనూ నష్టం వాటిల్లింది. మక్త, సీతారాంపూర్లో కరెంట్ స్తంభాలు విరిగాయి. కరీంపేట్, తదితర గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. చిగురుమామిడి మండలం రేకొండ, సీతారాంపూర్, లంబాడి పల్లె తదితర గ్రామాల్లో ఆస్తి నష్టం జరిగింది. లంబాడిపల్లి, రేకొండ, చిగురుమామిడి దారుల్లో చెట్లు విరిగి పడ్డాయి. రేకొండలో అల్లెపు రాములు, సందెవేని పద్మ ఇంటి పైకప్పులు లేచి పోయాయి. చిగురుమామిడి రేకొండ రహదారిపై చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సైదాపూర్ మండలం సర్వాయిపేటలో విద్యుత్తు లైన్లు తెగిపడ్డాయి. వేముల నర్సయ్య, వేముల కొండయ్య ఇంటిపై కప్పులు ఎగిరి పోయాయి. వెన్కపల్లిలో ధాన్యం కుప్పలు తడిశాయి..
ప్రభుత్వమే ఆదుకోవాలె
మాది దస్తగిరిపల్లి. పది రోజుల కింద పెద్దపల్లి మార్కెట్ల వడ్లు పోసినం. కొనడానికి టైం పడుతదని అధికారులు అన్నరు. దీంతో రోజూ వడ్లను పొద్దంత ఎండపోసి, రాత్రి రాశిగా పోస్తున్నం. నిన్ననే (సోమవారం) మాయిచ్చర్ వచ్చింది. కానీ, బార్దాన్ ఇవ్వలేదు. చెడుగొట్టు వానతో వడ్లన్నీ తడిసిపోయినయి. నీటిలో కొట్టుకుపోయినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. తడిసిన వడ్లును మద్దతు ధర ఇచ్చి కొనాలె.
– మేకల స్వరూప, రైతు, దస్తగిరిపల్లె (పెద్దపల్లి మండలం)
కండ్ల ముందే తడిసిపాయె
మాది నందిమేడారం. నాకు భూమి లేదు. ఊళ్లె పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. మొన్ననే కోసి 15 ట్రిప్పుల ధాన్యం ధర్మారం వ్యవసాయ మార్కెట్కు తెచ్చిన. ఇయ్యాళ పొద్దుగాలనే మబ్బుపడ్డది. బ్లేడ్ ట్రాక్టర్ తెచ్చి ధాన్యాన్ని కుప్పగా పోద్దామనుకున్న. అంతలోనే మధ్యాహ్నం బాగా కొట్టి కండ్లముందే ధాన్యం తడిసిపాయె. ట్రాక్టర్ లోడ్ వడ్లు వరదలో కొట్టుకుపోయినయి. ఏం చేసుడు? ఎట్ల చేసుడు? నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్టపరిహారం ఇయ్యాలె. తడిసిన ధాన్యాన్ని కొనాలె.
– ధనిశెట్టి లచ్చయ్య రైతు, నంది మేడారం (ధర్మారం)
జగిత్యాల జిల్లా..
జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఎఫెక్ట్ కనిపించింది. పెగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మామిడి కాయలు నేల రాలాయి. ఆరవల్లిలో రైతు కట్ల రాజేందర్కు చెందిన రెండెకరాల మక్క నేలవాలింది. నంచర్లలో తాటి చెట్టు విరిగి, విద్యుత్ స్తంభంపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మల్లాపూర్-ఖానాపూర్ మధ్య రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. మల్లాపూర్ మండల కేంద్రంలో గాలికి మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి.
టైంకు కొంటే ఈ నష్టం జరిగేది కాదు
నేను పెద్దపల్లి మార్కెట్కు తొమ్మిది రోజుల కింద వడ్లు తెచ్చిన. ఆరబెట్టిన. మూడు రోజుల కింద మాయిచ్చర్ వచ్చింది. సంచులు ఇస్తే వడ్లు నింపుతా అని అడిగినా సెంటర్ నిర్వాహకులు పట్టించుకోలే. లారీలు వస్తలేవని, హమాలీలు లేరని బార్దాన్ ఇవ్వలేదు. ఇప్పుడు వర్షానికి తడిసిపాయె. ఎవరిదీ బాధ్యత? మాయిచ్చర్ వచ్చినప్పుడే గోనే సంచులు ఇచ్చి తూకం వేస్తే నాకీ నష్టం జరిగేది కాదు. సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ గోస వచ్చింది.
– కోల కమలాకర్, రైతు (పెద్దపల్లి)
ఇరువై రోజులైనా కొనలె.. ధాన్యం తడిసిపాయె
నాకు ఎవుసపు భూమి లేదు. మా ఊళ్లే రెండున్నర ఎకరాల కౌలుకు తీసుకున్న. యాసంగిల వరి ఏసిన. ఇరువై రోజుల కింద వడ్లను గ్రామంలోని కేంద్రానికి ధాన్యం తెచ్చిన. కానీ, ఏం లాభం? కొనుగోళ్లలో మస్తు జాము చేస్తున్రు. మునుపటి లెక్క వెంటనే కొంటలేరు. నా లైన్ ఎప్పుడు వస్తదా..? రోజుల తరబడి ఇక్కనే ఉంటున్న. తీరా ఇయ్యాల వానపడి వడ్లన్నీ తడిసినయి. కొన్నివడ్లు వరదలో కొట్టుకపోయినయి. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇచ్చి, తడిసిన ధాన్యం మొత్తం కొనాలి.
– గాదెం రాజయ్య, కౌలు రైతు, ఆరవల్లి (పెగడపల్లి మండలం)