Godavarikhani | కోల్ సిటీ, మే 14: ఒకటి కాదు.. రెండు కాదు… 20 యేళ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తున్న వ్యాపారులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. రేపటి నంది బతుకుడెట్ల అంటూ ముల్లెమూట సర్దుకున్నారు. ఇన్నాళ్లు అన్నం పెట్టిన దుకాణాలు కళ్లెదుటే నేలమట్టం అవుతుంటే బరువెక్కిన గుండెలతో వ్యాపారులు లబోదిబోమన్నారు. గోదావరిఖని బస్టాండ్ ఏరియా ప్రధాన రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న దుకాణాలను సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు బుధవారం ఉదయమే జేసీబీ సాయంతో కూల్చివేయించారు. దీంతో స్థానికులు సంఘటన స్థలంలో గుమిగూడారు.
పోలీస్ బందోబస్తు మధ్య బాధిత వ్యాపారులు చూస్తుండగానే గంట వ్యవధిలోనే దుకాణాలు మొత్తం నేలమట్టం చేశారు. అప్పటికీ వ్యాపారులు ముల్లెమూట సర్దుకొని రోడ్డుకెక్కారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికే రాజీవ్ రహదారి ఆసుకొని ఉన్న దుకాణాలు కూల్చివేయాల్సి వచ్చిందని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న ఓ మద్యం దుకాణంను మాత్రం వదిలిపెట్టి ఆ ప్రక్కన ఉన్న దుకాణాలను కూల్చివేయడం గమనార్హం. రామగుండం మాజీ శాసన సభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సంఘటన స్థలంకు చేరుకొని కూల్చివేతల చర్యలను ఖండించారు.
రామగుండంలో అభివృద్ధి పేరుతో విధ్వంసకాండ ఇంకెంత కాలం సాగుతుందో ఓపిక పడుతున్నామనీ, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఇప్పటికే ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో మొబైల్ దుకాణాలను, ఓల్డ్ అశోక్ థియేటర్ను కూల్చివేసి అనేక మంది వ్యాపారుల బతుకులను ఆగమాగం చేశారని పేర్కొన్నారు.