తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాగునీటి తండ్లాటను దూరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఇంటి ముందర నల్లానీటితో దప్పిక తీర్చుకుంటున్నది. స్వరాష్ట్రంలో తమ తాగునీటి గోస తీర్చిన సర్కారుకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నది.
ఉమ్మడి పాలనలో ఎండకాలం వచ్చిందంటే తాగునీటి కోసం హుజూరాబాద్ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. బోరుబావుల వద్ద నిత్యం బిందెలతో బారులు తీరేవారు. ప్రతిరోజూ పట్టణంలో ఎక్కడో ఓ చోట ఖాళీ బిందెలతో మహిళల ఆందోళనలు కొనసాగేవి. పర్యటనకొచ్చిన ప్రజాప్రతినిధులను సైతం నిలదీసేది. హుజూరాబాద్లో ప్రధానంగా విద్యానగర్, కాకతీయకాలనీ, గాంధీనగర్, పాత ఎక్చేంజ్ తదితర ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉండేది. దీనికి తోడు పూర్వకాలంలో వేసిన పైపులైన్ నిత్యం ఏదో ఒక చోట పగలడం.. చాలీచాలని నీళ్లతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి తాత్కాలికంగా సమస్య తీర్చేవారు. ఇలాంటి సమస్యలు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. మిషన్ భగీరథలో భాగంగా రూ.50 కోట్లు మున్సిపల్లో ప్రభుత్వం వెచ్చించింది.
మార్చి వచ్చిందంటే చాలు… ఒకప్పుడు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. దీనికోసం మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారు. ఇదీ కొంతమేర ప్రజలకు ఉపశమనం కల్గిన బల్దియాకు బిల్లు తడిసి మోపడయ్యేది. వేసవి వచ్చిందంటే పాలకవర్గానికి గుండెళ్లో రైళ్లు పరుగెత్తేవి. రోజుకు పదుల కొద్ది ట్యాంకర్లు వాడవాడలకు వెళ్లి నీటిని సరఫరా చేసేవి. ముఖ్యంగా విద్యానగర్, కాకతీయ కాలనీ తదితర ప్రాంతాల్లో బోర్లు కూడా వట్టి పోవడంతో నీటి సమస్య ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ కాలనీ వాసులు పనులన్నీ పక్కన బెట్టి వేకువ జాము నుంచే నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూసేటోళ్లు.. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో ప్రజలకు ఈ నీటి బాధల నుంచి విముక్తి లభించింది. బోరు నీటి వినియోగం కూడా తప్పింది. మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నప్పటి నుంచి దాదాపుగా ట్యాంకర్ల గోల తప్పింది
పట్టణానికి నిత్యం నీటి సరఫరాకు బోర్నపల్లి గుట్టపై 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పెద్ద ట్యాంక్)ను నిర్మించారు. ఈ ట్యాంక్లోకి తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గుట్టపై నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ నీరు ఓవర్హెడ్ ట్యాంక్లకు సరఫరా జరుగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 15 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు, సైదాపూర్ రోడ్డులో షాదీఖాన వద్ద 10 లక్షల లీటర్ల కెపాసిటితో ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించారు. సముద్ర మట్టానికి 320 మీటర్ల ఎత్తులో నిర్మించడంతో పట్టణంలో ఇంటి వద్ద మోటారు సహాయం లేకుండానే 10 ఫీట్ల ఎత్తు వరకు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి
భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మిషన్ భగీరథ పనులు చేపట్టినప్పుడు పట్టణ జనాభా దాదాపు 35 వేలు ఉంది. ప్రస్తుతం 40 వేల వరకు ఉండగా పట్టణ జనాభా 85 వేల వరకు చేరిన కూడా నీళ్లు సరిపోయే విధంగా పైప్లైన్లు నిర్మించారు. అంటే మరో 50ఏళ్ల వరకు ప్రస్తుతం చేపట్టిన నీటి వ్యవస్థ సరిపోనుంది.
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తప్పాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పైపులైన్లు నిర్మించారు. ఒక్కో మనిషికి 100 లీటర్లకు పైగా నీరు సరఫరా చేస్తున్నాం. ఒకవేళ నీళ్లు అవసరం లేకపోతే నళ్లాను బంద్ చేయండి. నీటిని పొదుపుగా వాడుకోవాలి.
– గందె రాధిక, మున్సిపల్ చైర్పర్సన్
ఒకప్పుటి నీటి గోస రోజులు మరల రావద్దు. తెల్లారిందంటే నీళ్లకు ట్యాంకర్ల కోసం ఎదురు చూసేటోళ్లం. అవికూడా సరిపోయేవి కావు. మిషన్ భగీరథ పథకం వచ్చినప్పటి నుంచి నీళ్ల కోసం ఎదురుచూసే బాధ తప్పింది. తాగునీరందిస్తున్న సర్కారుకు రుణపడి ఉంటం.
– జీ సరోజన, విద్యానగర్