పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి మొదలైంది. తొలిరోజు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు, కరీంనగర్, నిజామాబాద్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండడంతోపాటు పెద్దపల్లిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఇటు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఈ నెల 20న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, గులాబీ అభ్యర్థులంతా గురువారమే అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీఫాంలు అందుకున్నారు. అయితే, నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి.. అదనపు భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
కరీంనగర్, ఏప్రిల్ 18 (కరీంనగర్ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తొలి అంకం గురువారం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29న ఉపసంహరణ, అదే రోజు పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటన, వచ్చే నెల 13న పోలింగ్ ఉండనున్నది. కాగా, నామినేషన్లు అట్టహాసంగా వేసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు.
ప్రధానంగా ప్రచారంలో ఇప్పటికే దూసుకెళ్తున్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ముహూర్తం చూసుకొని మరీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అలాగే, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ఈ నెల 20న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సైతం బీఆర్ఎస్ ఆగ్రనేతలు తరలి రానుండగా.. అట్టహాసంగా నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని పార్టీల కంటే ముందే లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మార్చి 12న పార్లమెంట్ ఎన్నికలకు కదనభేరి మోగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు బీజేపీకి ఓటు వేస్తే వచ్చే నష్టాల గురించి వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అందుకు ఎలా పనిచేయాలో.. ఎలా కష్టపడాలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ మద్దతు కూడగట్టారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే కొప్పుల ఈశ్వర్ సింగరేణి ప్రాంతంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అదే బీజేపీ నేటి వరకు పెద్దగా ప్రచారం చేసినట్లు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ అడ్డదారుల్లో పయనిస్తున్నది. బీఆర్ఎస్ నాయకులే టార్గెట్గా కుట్రలు, కుతంత్రాలతో ముందుకెళ్తున్నది. ముందుగా బేరసారాలు చేస్తూ.. పార్టీలోకి ఆహ్వానిస్తున్నది. అలా రాని వారిని బెదిరింపులకు పాల్పడుతున్నది. పోలీసుల అండతో కేసులు పెడుతున్నది. అయినా, బీఆర్ఎస్ నాయకులు చెక్కు చెదరని సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ముందజలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గాన్ని ఓ దఫా చుట్టేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో స్పష్టతనిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. బీజేపీ ప్రచారం చేస్తున్నా.. గెలిపిస్తే ఏమి చేస్తారో అన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం ఆయన ప్రచారంలో మెజార్టీ భాగం దేవుడి పేరుతోనే నడుస్తున్నది. ఇక కాంగ్రెస్ అయితే అభ్యర్థినే ప్రకటించలేదు. కానీ, తనకే టికెట్ వస్తుందని వెలిచాల రాజేందర్రావు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్సైతం ఆయనను వెంట పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు.