వేములవాడ టౌన్, మార్చి 7 : జిల్లాలోని శివాలయాలు మహాశివరాత్రికి సుందరంగా ముస్తాబయ్యాయి. లయకారకుడైన మహాదేవుడికి శివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెంది, ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం భక్తుల కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతోంది.
ఇక్కడ మహాశివరాత్రి జాతరను వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు దాదా పు 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు రాజన్నను దర్శించుకుని తరిస్తారని అధికారుల అంచనా. రాజన్న కోడెను కట్టేయడం ఇక్కడి ప్రత్యేకత. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు, రాత్రివేళ జాగరణ చేస్తారు.
చరిత్ర : పూర్వం బ్రహ్మ, విష్ణుమూర్తిలకు తమలో ఎవరంటే గొప్ప అనే పోటీ తలెత్తింది. ఆ సమయంలో వారి మధ్య ఒక లింగం ఆవిర్భవించింది. లింగం మొదలు, చివర ఎవరు తెలుసుకుంటే వారే అధికులని శివుడు చెబుతారు. బ్రహ్మదేవుడు హంసరూపంలో లింగం మూలాన్ని తెలుసుకునేందుకు పాతాళం వైపు వెళ్లగా, విష్ణువు పైభాగం తెలుసుకోవడం కోసం వరాహరూపంలో వెళ్లాడు.
ఇద్దరికి ఆది అంతాలు తెలియలేదు. బ్రహ్మదేవుడు తానే అధికుడని నిరూపించుకునేందుకు గోవు, మొగలిపువ్వును సాక్షంగా తెచ్చుకున్నాడు. ఇది గమనించిన శివుడు లింగరూపం నుంచి ప్రత్యక్షమై తప్పుచేసిన బ్రహ్మకు భూలోకంలో ఆలయం ఉండరాదని శపిస్తాడు. కాలభైరవుడిని రప్పించి బ్రహ్మ అయిదు తలల్లో ఒకదానిని ఖండింపజేసాడు. బ్రహ్మకు సహకరించిన మొగలిపువ్వును భక్తులెవ్వరూ తన పూజకు వాడరాదని ఆజ్ఞాపిస్తాడు. అబద్ధం చెప్పని విష్ణువుకు భూలోకంలో తనతో సమానంగా పూజలు అందుతాయని శివుడు అంటాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువు పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.
పైన చెప్పిన సందర్భంలో పరమశివుడు మాఘ కృష్ణ చతుర్ధశి రోజున కోటి సూర్యకాంతులతో శివలింగ రూపంలో ఆవిర్భవించిన అర్ధరాత్రే శివరాత్రి. శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రాత్రి. ఈసందర్భంగా శివుడ్ని బిల్వపత్రాలతో పూజించి, అభిషేకాది అర్చనలు చే యాలి. రోజంతా ఉపవాస వ్రతాన్ని పాటించా లి. రాత్రి జాగరణ చేస్తూ నాలుగు జాముల్లో అభిషేకించాలి. మరుసటిరోజు శివపూజ చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి.
రుద్రాభిషేకం : మహా శివరాత్రి పర్వదినం రాత్రి 11 గంటలకు లింగోద్భవకాలాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి జరిపే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి ప్రత్యేకత ఉంది. మహాన్యాసాన్ని చేస్తూ ముందుగా తమదేహంలోని కొన్ని ఇంద్రియాలను తాకుతూ రుద్రమంత్రాలను చదువుతూ రుద్రుడిని అందులోకి ఆహ్వానిస్తారు. అతడు పరిపూర్ణంగా రుద్రుడి రూపాన్ని దాల్చిన తర్వాత యజుర్వేదంలోని రుద్రం, నమకచమక మంత్రాలను ఉచ్చరిస్తూ అభిషేకిస్తారు. ఇందు లో నమకచమకాలని ఒకసారి చెప్పి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం.
అలాగే 11సార్లు నమకాన్ని పఠించి ఒకసారి చమకాన్ని చదివి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఏకాదశ రుద్రులకు ప్రతీక. ఒక్కో అభిషేకంలో ఒక్కో రుద్రుడు ఆవిష్కృతమవుతాడు. అనంతరం నీటితో మరోసారి అభిషేకించి స్వామివారి మూలమూర్తిని అలంకరించి మంగళహారతిస్తారు. ఆ తర్వాత వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు.
స్వామివారికి నీరాజనం అర్పించడంతో లింగోద్భవకాల రుద్రాభిషేకం ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసంతో త్రికరణశుద్ధిగా శివుడిని పూజిస్తే సంవత్సరకాలం నిత్య శివార్చన చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తూ శంకరుడే బ్రహ్మదేవునికి చెప్పినట్లుగా పురాణం చెబుతోంది. మహాశివరాత్రి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. సాధారణంగా అన్ని పండుగలు పగలు జరుపుకుంటే మహాశివరాత్రి మాత్రం రాత్రి పూట జరుపుకుంటారు.
శివరాత్రి జాతర కోసం రాజన్న చెంతకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా చేసిన ఏర్పాట్లు, వసతులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలుగకుండా చూడాలని దేవాదాయశాఖ కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వారి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ పూ జారి గౌతమి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఈ ఈ రాజేశ్,డీఈ మధు రఘునందన్ ఉన్నారు.
మహా శివరాత్రికి వచ్చే భక్తుల కోసం ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 24 ఉచిత బస్సులను ఆలయ అర్చకుల వేదమంత్రాల మధ్య కొబ్బరికాయకొట్టి ప్రా రంభించారు. ఈ బస్సులు తిప్పాపురం, కోరు ట్ల బస్టాండ్ల నుంచి భక్తులను ఆలయ పార్కింగ్స్థలం వరకు ఉచితంగా తీసుకువస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. అనంతరం బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ఈవో కృష్ణప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.
వేములవాడ టౌన్, మార్చి 7: మహా శివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి పట్టువస్ర్తాలు సమర్పించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్ర్తాలు సమర్పించారు.
వేములవాడ టౌన్,మార్చి 7: మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమం కనుల పండువగా ఉందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శివా ర్చనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తుల ఆహ్లాదం కోసం భరతనాట్యం, పేరిణినృత్యం, కూచిపూడి, కథకళి వంటి కళలను వేదికమీద ప్రదర్శిస్తున్నారని అన్నారు.
గురువారం 11 కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఇందులో భాగంగా మొదటిరోజు దాదాపు 300 మంది కళాకారులు తమ కళలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జ యంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ గౌతమి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.