కరీంనగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
సమావేశం నిర్వహణతోపాటు ఇటీవలి పరిణామాలు, కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలు, తద్వారా రైతులకు ఏర్పడుతున్న ఇబ్బందులు, ఎండిపోతున్న పొలాలు వంటి అంశాలతోపాటు ప్రజల పక్షాన నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తున్నది. సుమారు యాభై మంది వరకు ఈ సమావేశానికి రావాలని పిలుపు అందినట్లు తెలుస్తుండగా, అధిష్ఠానం ఆదేశాలతో సంబంధిత నాయకులకు సమాచారం ఇచ్చామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. పార్టీ నుంచి పిలుపు అందిన నాయకులంతా నిర్దిష్ట సమయానికి హాజరుకావాలని కోరారు.