ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో తమ రూపురేఖలను మార్చుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధిస్తున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పురస్కారాల్లో ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ అవార్డ్స్లో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురసారం కింద దేశంలోని 27 గ్రామ పంచాయతీలకు శనివారం అవార్డులు ప్రకటించింది. ఇందులో రాష్ట్రం నుంచి ఎనిమిది ఉండగా ఉమ్మడి జిల్లా నుంచే రెండు ఉండడం గర్వకారణం.
9 విభాగాల్లో ఉత్తమ మండలం తిమ్మాపూర్
తిమ్మాపూర్, ఏప్రిల్ 7 : తిమ్మాపూర్ మండలానికి జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అహర్నిశలు చేసిన కృషి.. పల్లెప్రగతితో మారిన రూపురేఖలు.. ఫలితంగా అ‘ద్వితీయ’మైన అభివృద్ధితో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా 42వేల పైచిలుకు జనాభా ఉంది. అందుకు తగ్గట్టుగా పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే పలుసార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులను ఈ మండలంలోని పలు గ్రామాలు అందుకున్నాయి. ఇటీవల తిమ్మాపూర్, పర్లపల్లి గ్రామాలు రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించాయి.
తొమ్మిది అంశాల ఆధారంగా..
నానాజీ దేశముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులో భాగంగా కేంద్రం తొమ్మిది అంశాలను పరిగణలోకి తీసుకున్నది. ప్రజలకు మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య పంచాయతీ, పిల్లలతో స్నేహపూర్వకంగా మెదలడం, ప్రజలకు తాగు నీటి సరాఫరా, పచ్చదనం పరిశుభ్రత, ప్రజల స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, ఉత్తమ పరిపాలన, మహిళా సంక్షేమం అంశాల ఆధారంగా తిమ్మాపూర్కు రెండో స్థానం లభించింది. మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యుత్తమంగా చేసిన అభివృద్ధి, పల్లెప్రగతిలో పరిశుభ్రత, డంపింగ్యార్డు, చెత్తసేకరణ, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం వంటి కార్యక్రమాలు సంపూర్ణంగా చేసిన సందర్భంగా ఈ అవార్డుకు ఎంపికైంది. దేశ వ్యాప్తంగా మూడు పంచాయతీలకు అవార్డు ప్రకటించగా.. ఒడిశా రాష్ట్రం గంజం జిల్లాలోని హింజిలికట్ మొదటి, త్రిపుర రాష్ట్రం ట్రైబల్ ఏరియాలోని కుమార్ ఘాట్ మూడో స్థానాలు సాధించాయి. ఈ కేటగిరీలో అవార్డుతో పాటు రూ.75లక్షల ప్రైజ్మనీ రానున్నది.
రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాల ఫలితంగానే మండలానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉన్నది. ప్రభుత్వం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సర్పంచులు, అధికారులు సమన్వయంగా గ్రామాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మండలాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అవార్డు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
– కేతిరెడ్డి వనిత దేవేందర్రెడ్డి, ఎంపీపీ (తిమ్మాపూర్)
అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి
మండల ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన అభివృద్ధి, కృషితోనే జాతీయస్థాయిలో తిమ్మాపూర్ మండలం రెండో ర్యాంకు సాధించింది. పల్లెప్రగతి, ఇతర కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించి గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తోపాటు అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎంపీడీవో రవీందర్రెడ్డి, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ జితేందర్రెడ్డి, వైస్ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్, మండలాధికారులు నిత్యం ప్రగతిని పర్యవేక్షించినందుకు ఫలితంగా అవార్డు దక్కింది.
పెద్దపల్లి, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు అధ్వానంగా మారిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామం పల్లె ప్రగతి స్ఫూర్తితో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో మూడో ర్యాంకు సాధించి, దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నది. ఈ అవార్డుతో పాటు రూ.30 లక్షల నగదును ఈ నెల 17న ఢిల్లీలో అందుకోనున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజలు చేసిన కృషి ఫలితంగా ఈ పురస్కారం సాధించింది. సుల్తాన్పూర్కు జాతీయ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణమని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒకరికీ కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
2011జనాభా లెక్కల ప్రకారంగా గ్రామంలో 3467జనాభా, 748 కుటుంబాలు ఉండగా, సర్పంచ్ అర్శనపెల్లి వెంకటేశ్వర్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు తెలిసేలా గ్రామ అధికారులతో ప్రత్యేకంగా మూడు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి రోజు గ్రామస్తులు ఆ గ్రూపులో పోస్టు చేస్తే ఆ వెంటే పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎక్కడ చెత్త ఉన్నా.. డ్రైనేజీ జామ్ అయినా గ్రూపుల్లో పెట్టిన వెంటనే తొలగించేలా మానిటరింగ్ చేస్తున్నారు. ఇంటింటికీ ప్రత్యేక వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. శుభకార్యాలు, విందులు, వినోదాల సమయంలో ప్లేట్లు, ఆహార వ్యర్థాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే ప్రత్యేక వాహనంలో వేస్తున్నారు. దీంతో ఆ చెత్తను నేరుగా చెత్త సేకరణ కేంద్రం(సెగ్రిగేషన్ షెడ్)కు తరలిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, తడిచెత్తతో సేంద్రియ ఎరువును తయారుచేసి విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నారు.