Thippiri Tirupati | కోరుట్ల, మే 13 : నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షకు హాజరయ్యారు. విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన తిరుపతి 1983-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయన విప్లవ భావజాలానికి ఆకర్షితులై రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్గా పనిచేశారు. అదే కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పేపర్ ను ఆయన బైకాట్ చేశారు.
మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ తెలుగు సెకండియర్ పరీక్ష మాత్రం మిగిలిపోయింది. ఇటీవల మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జన జీవనంలోకి అడుగిడిన దేవ్ జీ, అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తి చేయాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని మాస్ట్రో జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 45 ఏళ్ల తర్వాత పరీక్షా హాలులో అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా పరీక్షకు ముందు మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చినట్లు తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ పరీక్ష విధానంలో మార్పులు వచ్చిన ఇప్పుడు కూడా తాను విద్యార్థిగా మళ్లీ పరీక్ష రాసేందుకు రావడం కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత న్యాయ విద్య అభ్యసించి పేదలకు న్యాయ సహాయం అందిస్తానని దేవ్ జీ వెల్లడించారు. కాగా పరీక్ష రాసేందుకు వచ్చినా తిరుపతిని పరీక్ష హాల్ గేటు వద్ద అధ్యాపకులు తనిఖీ చేశారు.