జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 3: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదు. వాళ్లు ఇచ్చే హా మీలకు గ్యారంటీ ఉంటదా..? ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు ఇస్తున్నరు. రూ.4వేల పింఛన్ ఇస్తరట. నమ్ముదామా..? నేనొక్కటే చెబుతున్నా.. వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.వెయ్యికి మించి పింఛన్ ఇవ్వడంలేదు. అక్కడ ఇవ్వనోళ్లు.. ఇక్కడ ఇస్తరా..?, ఆడబిడ్డల పెండ్లికాడికి వచ్చి తినిపోయేటోళ్లు.. వీసమెత్తు సాయం చేయనోళ్లు.. నేడు తులం బంగారమిస్తమనే మాటను నమ్ముదామా..? ఒకసారి ఆలోచించండి’ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ ప్రజలకు సూచించారు.
జగిత్యాల మోతె రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పొరండ్ల గ్రామానికి చెందిన నక్క హరీశ్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు, మహిళలు, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన 20 మంది గంగపుత్ర సంఘం వారు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు చెపుతున్నది ప్రతీది అబద్ధమేనన్నారు. మన రాష్ట్రంలో ఆసరా పింఛన్ కింద రూ.2వేలు ఇస్తున్నామని, వచ్చే మార్చి నుంచి రూ.3వేలకు పెంచుకుంటామని, ఏడాదికి రూ.500 చొప్పున నాలుగేండ్లలో రూ.5వేలు చేసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని, మ్యానిఫెస్టోలో ప్రకటించారని గుర్తుచేశారు.
మన రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా వారి పాలిత రాష్ర్టాల్లో ఎందుకివ్వడం లేదో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. పొరండ్ల గ్రామంలో 620 ఇండ్లు ఉంటే 621 మందికి వివిధ రూపాల్లో పింఛన్లు అందిస్తున్నామని, 88 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రూ.40కోట్లతో గ్రా మాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2014లో గుప్పెడు మందితో లక్ష్మీపూర్ నుంచి ప్రచారం ప్రారంభించి లక్ష ఓట్లు పొందానని, లక్ష్మీపూర్ గ్రామ ఓటర్ల ఆశీస్సులతో ఈ మారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ గాంధేయ మార్గంలో శాంతియుతంగా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారని, కానీ కాంగ్రెస్ హింసా మార్గాన్ని నమ్ముకుందని, ఆ పార్టీ నాయకుడితో ఎంపీ ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ కో సం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను స్వరాష్ట్రంలో ఆదుకున్నామని, వారి పిల్లలకు ఉద్యోగాలిచ్చి ఆదుకున్నట్లు వివరించారు. లక్ష్మీపూర్లో సైతం యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకొని ఆ ఇంటికి ఉద్యోగాన్ని కల్పించామన్నారు. అల్లీపూర్ను మండలంగా చేసి తీరుతామన్నారు.
కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బాల ముకుందం, దావ సురేష్, పోరండ్ల ఎంపీటీసీ సౌజన్యతిరుపతి, నాయకులు రవి, పడిగెల గంగారెడ్డి, శేఖ ర్, సుధాకర్, గంగాధర్, కొర్రి భాగ్య, బొంతల మంగ, నక్క పవన్, బోధనపు తిరుపతి, పవన్, రాజశేఖర్, లక్ష్మీపూర్ సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సభ్యురాలు సునీతలక్ష్మణ్, ఆత్మ చైర్మన్ ఎలేటి రాజిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజిరెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, చిన్నగంగయ్య, రత్నాకర్, జనార్దన్, రాజేశ్, నరేష్ ఉన్నారు.