బొమ్మారెడ్డిపల్లి గోసపడుతున్నది. సాగునీరు లేక అల్లాడిపోతున్నది. ప్రస్తుతం ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుండగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. సాగునీరిచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటున్నది.
ధర్మారం, మార్చి 13: బొమ్మారెడ్డిపల్లి నాగుల చెరువు కింద ఏటా యాసంగిలో 50 ఎకరాలపైనే వరి, మక్క సాగు చేస్తుంటారు. మల్లాపూర్ శివారులోని ఎస్సారెస్పీ డీ83/బీ 1-ఎల్ కెనాల్ నుంచి వచ్చే నీటితోనే ఈ చెరువు నిండుతుంది. చిన్న కాల్వల ద్వారా నీరు ఒర్రెల్లోకి చేరి పంటలకు అందేది. ఏటా ఇదే సమయంలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉండేవి. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులు ఏ బాధా లేకుండా సాగు చేసుకున్నారు. ఈ యాసంగిలోనూ నీళ్లు వస్తాయనే నమ్మకంతో వరి, మక్క వేశారు. అయితే 1-ఎల్ కెనాల్ నుంచి అంతంత మాత్రంగానే నీరు రావడంతో చెరువు నిండలేదు.
ఒర్రెలు పారలేదు. మరోవైపు భూగర్భజలాలు కూడా అడుగంటి సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. రైతు గడ్డం మహిపాల్ రెడ్డి తన రెండున్నర ఎకరాల పొలంలో పశువులను మేపుతుండగా, మరో రైతు మహిపాల్రెడ్డి ఎకరం మక్క చేనును పూర్తిగా వదిలేయగా, మిగతా రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొందరు పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు చేసేదేమీ లేక ఎండిన పంటలో పశువులు మేపుతున్నారు. కేసీఆర్ పాలనలో ఏ రందీ లేకుండా పంటలు పండించుకున్నామని, ఇప్పుడు అరిగోస పడుతున్నామని వాపోతున్నారు. ఎస్సారెస్పీ అధికారులు స్పందించి నాగుల చెరువును నింపి, పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.