నాడు ఇచ్చిన అప్పుల వసూళ్లకే పరిమితమైన సంఘాలు నేడు వినూత్న సేవలు అందిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతూ అభివృద్ధి పథంలో వెళ్తున్నాయి. రైతన్నకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక అప్పులతోపాటు విత్తనాలను, ఎరువులను అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సహకార సంఘాలపై దృష్టి సారించి, వాటితో అవసరమైన చోట వరిధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయిస్తుండడంతో ఆర్థికంగా పుంజుకున్నాయి. పెట్రోల్ పంపులు ఏర్పాటు చేస్తూ లాభాలు పొందుతున్నాయి.
– సైదాపూర్, జూలై 10
స్వరాష్ట్రంలో సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క అప్పులు ఇవ్వడం, వసూలు చేయడమే కాకుండా రైతులకు పలు రకాల సేవలు అందిస్తూనే ఇతర వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలు పొందుతున్నాయి. సైదాపూర్ మండలంలోని రైతులు గతంలో ఎరువులు, విత్తనాలకోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం వెన్కేపల్లి-సైదాపూర్, వెన్నంపల్లి సింగిల్విండోలలో ఎరువులు, విత్తనాల విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో సౌకర్యంగా ఉన్నది. ఇందులో తక్కువ ధరకు ఇస్తుండడంతో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వెన్నంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఈ గ్రామ పరిసర ప్రాంతాల వారికి కొంత ఆర్థికభారం తగ్గుతున్నది. గతంలో రైతులు పొలాలు దున్నేటప్పుడు దూరప్రాంతాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ తెచ్చుకునే బాధ తప్పడంతో పాటు నాణ్యమైనది దొరుకుతన్నది. మరోవైపు సంఘానికి సైతం లాభాలు తెచ్చిపెడుతున్నది.
అభివృద్ధి బాటలో సంఘాలు
వెన్కేపల్లి-సైదాపూర్, వెన్నంపల్లి సహకార సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. వెన్కేపల్లి -సైదాపూర్ సంఘంలో సుమారు రూ.80 లక్షలతో రైతు ట్రైనింగ్ సెంటర్, నాబార్డు నిధులు రూ.1.40 కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఒక గోదాం ద్వారా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. వెన్నంపల్లి సంఘంలో నూతన భవన నిర్మాణంతో పాటు ఎక్లాస్పూర్లో గోదాముల నిర్మిస్తున్నారు. గతంలో సహకారం కరువై నష్టాల్లో ఉన్న సంఘాలు నేడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్నాయి.
అవసరమైన సేవలందిస్తున్నాం
సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన సేవలను అందిస్తున్నాం. అందుబాటులో విత్తనాలు, ఎరువులను ఉంచాం. ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ సహకారంతో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొన్నాం. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. సహకార సంఘం భవన నిర్మాణంతోపాటు, రైతు ట్రేనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. సహకార సంఘాలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– కొత్త తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో చైర్మన్
రైతులకు అండగా ఉంటున్నాం
సహకార సంఘం ద్వారా రైతులకు అండగా ఉంటున్నాం. వెన్నంపల్లిలో రైతులకోసం పెట్రోల్బంక్ ఏర్పాటుతోపాటు కొత్త భవనాన్ని నిర్మించుకుంటున్నాం. ఎక్లాస్పూర్లో కొత్తగా గోదాములు నిర్మిస్తున్నాం. రైతులకు రుణాలు అందించడంతోపాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎమ్మెల్యే సతీశ్కుమార్ సహకారంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేశాం.
– బిల్ల వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్విండో చైర్మన్