‘కాంగ్రెసోళ్లది ఏనాడైనా ఎవుసం చేసినా ముఖమేనా.. నాగలి పట్టిన్రా.. ఇత్తులు ఏసిన్రా.. ఎన్నడైనా రైతుల బాధలు తెలుసుకున్నరా.. మా కష్టాలు, కన్నీళ్లు పట్టించుకున్నరా.. అప్పుల పాలై సచ్చిపోతున్నా పట్టించుకోకపోతిరి? ఇప్పుడు ఎన్నికలున్నయని మళ్లీ వస్తున్నరు. నోటికి ఏదొస్తే అది ఈజీగా మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు. ఎట్ల సరిపోతదని మేం అడిగితే మళ్లీ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్రు? ఎట్లా పెట్టుకుంటం.
లచ్చ రూపాయలు ఎక్కన్నుంచి తెస్తం?’ అని జిల్లా రైతులు ఆగ్రహిస్తున్నరు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలపై మండిపడుతున్నారు. నాడు అరిగోస పెట్టారని, అప్పటి బాధలు ఇంకా మరిచిపోలేదని గుర్తు చేస్తున్నారు. మళ్లీ తమ జీవితాలతో ఆడుకోవద్దని, ఈ ఎన్నికల్లో మీ పార్టీని తీసి బంగాళాఖాతంలో వేస్తామని హెచ్చరిస్తున్నారు. పదేండ్ల నుంచి తమను కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ)
నేను ఓ కరెంటు (మోటర్ల) రిపేరర్నే. ఎవుసం కూడా చేస్త. 10 హెచ్పీ మోటర్లు వ్యవసాయనికి ఎన్నడూ సూడలే. తెలంగాణలో రైతులమంతా 3హెచ్, 5 హెచ్పీ మోటర్లే వాడుతం. ఊళ్లల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను 10 హెచ్పీ మోటర్లు ఎట్లా వాడుతరో నిలదీయాలి. ఎద్దెవుసం తెల్వనోనికి పాలన పగ్గాలు ఇస్తే రైతులమంతా ఆగమైతం. అసలు కాంగ్రెసోళ్లకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంతుంటదో? వాటికి ఎన్ని మోటర్లు పెడుతరో తెలుసా?. 10 హెచ్పీ మోటర్లు పెడితే అవి ఎక్కడికక్కడ పేలిపోతయ్. కొత్తవి పెట్టాలి.
వాటికోసం హైపవర్ లైన్లు వేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎన్నేండ్లు కావాలి. ఇవన్నీ చేసినా అంత పెద్ద మోటర్తో పాటు వాటికి పైపులు కావాలంటే ఒక్కో రైతుకు ఎంతలేదన్నా 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు ఖర్చయితయ్. అంత స్థోమత రైతులకు ఉంటదా? కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేదు లేదుగానీ, ఆ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ రైతులను ఆగం చేయాలని చూస్తున్నరు. కానీ ఎవుసం తెల్వనోళ్లను మేం నమ్మేది లేదు.
గతంల రికార్డులు మార్చాలన్న, రికార్డులలోకి పేరు ఎక్కాలన్న చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. పట్వారీ, ఆర్ఐ విచారించి, అధికారులు పరిశీలించి రికార్డులకు ఎక్కియాలంటే చాలా కాలమయ్యేది. ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగి చెప్పులరిగేవి. ధరణి వల్ల భూముల కొనుగోలు, అమ్మకాలతో పాటు వెంటనే రికార్డుల్లోకి యజమాని పేరు వెంటనే ఎక్కుతది. రైతులను మోసం చేసే పరిస్థితి రాదు. కబ్జాలు, పట్టాదారులు అనే సమస్య లేకుండా భూ యజమాని పేరు పట్టాదారుడిగా రికార్డులోకి వెళ్తుంది.
పాత పద్ధతిల రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తే, మళ్లీ పాత రోజులే వస్తయి. మనం రెవెన్యూ పరంగా మరో పదేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇగ ధరణి ఎత్తేస్తే రైతుబంధు రద్దయితది. కాంగ్రెస్ సచ్చేది లేదు.. వచ్చేదు లేదుగానీ, మా రైతుల జీవితాలను ఆగం చేసెటట్టు కనిపిస్తంది. మమ్మల్ని ముంచాలని కుట్ర చేస్తున్నరు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలె. కేసీఆర్కు అండగా ఉండాలె. మూడోసారి సీఎంను చేసుకోవాలె. అనవసరంగా ఆగం కావద్దు.
– రాజిరెడ్డి, ఎలబోతారం(కరీంనగర్ రూరల్)
కరీంనగర్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): నాడు భూముల గొడవలు అన్నీ ఇన్నీ కావు.. అధికారులు చేసిన నిర్వాకానికి పాలోళ్ల మధ్య గెట్టు పంచాయితీలు.. అన్నదమ్ముల మధ్య కొట్లాటలు.. ఒకరి పేరు బదులు మరొకరి పేరు తప్పు రాస్తే దాన్ని సరిదిద్దుకోడానికి ఏండ్లకాలంగా అధికారుల చుట్టూ తిరిగేది. ఒక్క తిరుగుడే కాదు.. వాళ్లడిగినన్ని పైసలు ముట్టచెప్పనిదే ఫైలు ముంగటికి పోకపోయేది.. ఈ మధ్యల పైరవీకారులు బతికేది.. చేతిల ఇన్ని పైసలుండి కొంత భూమి కొందామనుకునేటోళ్లకు చుక్కలు చూపించేది. రిజిస్ట్రేషన్ చేసుకోడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర రోజంతా పడిగాపులు పడేది.. అక్కడ ఎంతో కొంత ముట్ట చెప్పనిదే పని కాకపోయేది.
పేపర్లు చేతికచ్చినంక మ్యుటేషన్కనీ తాసిల్దార్ ఆఫీసుకు పోతే అక్కడా నెలల తరబడి తిప్పుకునేది.. వీఆర్వోలు ఆ పేపర్ లేదు.. ఈ పేపర్ లేదు.. పేరు తప్పు పడ్డది.. అంటూ ముప్పుతిప్పలు పెట్టేది. చివరికి అన్ని పేపర్లు సరిచేసుకుని పట్టుకెళ్తే తప్పిచ్చుక తిరిగేది.. చివరికి ఎంతో కొంత ముట్టచెప్తే కానీ పనిచేయకపోయేది. పహాణీలల్ల పేర్లు మార్చి ఇబ్బందులు పెట్టేది.. పాసుబుక్కులల్ల తీరొక్క కాలాలతో పట్టాదారుడికి.. కౌలుదారులకు తాకులాటలు ఉండేటివి.. ఇట్ల ఏండ్లకాలంగా కోర్టుల చుట్టూ తిరిగేది. గిట్ల రైతులను అరిగోస పెట్టిన దరిద్రపు వ్యవస్థ ధరణి రావడంతో పీడ విరగడైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది. భూములకు భద్రత లభించింది.
ఒకరి భూమి మరొకరికి పోదన్న నమ్మకం కలిగింది. ఎక్కడి నుంచైనా తన పేరును భూమి ఉన్నదో లేదో చూసుకునే అవకాశం వచ్చింది. ఇంత మంచి ధరణిని కాంగ్రెస్ వస్తే రద్దు చేస్తామంటుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతి వస్తే మళ్లీ గెట్టు పంచాయితీలు జరుగుతాయని, తాకులాటలు పెట్టే వాళ్లను తరిమి కొడుతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదని, అట్లాంటి పార్టీని రానివ్వమని, భూములను కాపాడే బీఆర్ఎస్కే మద్దతిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెసోళ్లు తెస్తమంటున్న పాతపద్ధతితో రైతులకు తీరని నష్టం కల్గుతది. ప్రస్తుతం ఉన్న యాజమాని పట్టాలో కబ్జాదారులను, కౌలుదారుల పేర్లను చేర్చడంతో, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాలె. ఆ పద్ధతిల చాలా లోపాలున్నయి. మళ్లీ ఒకరికొకరు కొట్టుక సచ్చుడైతది. గిసోంటి తాకులాటలు పెట్టే కాంగ్రెస్ను తరిమికొట్టాలి. కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన ధరణితో వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అపదలో భూమి అమ్ముకోవడానికి, కొనడానికి కూడా సులభంగా ఉంటది. మంచిగున్న ధరణిని తీసేసి కాంగ్రెసోళ్లు తలా తోకలేని పద్ధతి తెస్తామంటే ఊరుకుంటమా?. ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ రైతులను ముంచే మాటలు మాట్లాడుతంది. కాంగ్రెస్ను నమ్మేదే లేదు. కేసీఆర్ సారునే గెలిపించుకుంటం.
– అనుముల కొండయ్య, గోపాల్పూర్(కరీంనగర్ రూరల్)
కాంగ్రెస్ ధరణి తీసేస్తామనడం మూర్ఖత్వపు ఆలోచన. సీఎం కెసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో భూముల హకులపై దళారుల పెత్తనం పూర్తిగా తొలిగిపోయింది. లంచాల బాధ పోయింది. ఒకరి పొలం మరొకరి మీద మార్చడం వంటివి లేనే లేవు. ధరణి తోనే రైతుల భూములకు భద్రత. దాంతోనే మాకు పెట్టుబడి సాయం అందుతుంది. మంచిగా పంటలు పండించుకుంటున్నం. ధరణి పోర్టల్తోనే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అట్లాంటిది కాంగ్రెసోళ్లు ధరణి రద్దు చేస్తామనడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల సమస్యలతో రైతులు పడ్ట కష్టాలు ఇగ చాలు. మళ్లీ అట్లాంటి రోజులు రావద్దంటే కాంగ్రెస్ను రానీయద్దు.
– సందవేని కనకయ్య, రైతు, గన్నేరువరం
రైతులు గతంలో పడ్డ ఇబ్బందులన్నీ ధరణితో పోయినయ్. ఒకప్పుడు పాస్బుక్కులో సవరణలు చేయాలంటే ఏండ్ల కాలంగా తిరిగేది. పైసలు తీసుకున్న రెవెన్యూ అధికారులు పనిచేయలేదు. ఎన్నో సమస్యలను ధరణి పరిష్కరించింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అప్పటికప్పుడే పాస్ బుక్లలో నమోదు కావడంతో అవకతవకులకు పాల్పడే అవకాశం లేకుండా పోయింది. అలాగే, జిల్లా కలెక్టర్ పరిధిలో లాగిన్ ఉండటంతో రెవెన్యూలో కింది స్థాయి సిబ్బంది మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోవడంతో సమస్యలు రావడం లేదు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిమిషాల్లోనే అవుతున్నయి. అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. అంత గొప్ప ధరణిని కాంగ్రెసోళ్లు రద్దు చేస్తామనడం మూర్ఖత్వం. వాళ్లు మళ్లీ పాతపద్ధతి తీసుకస్తామంటున్నరు. అట్లయితే మళ్లీ పైరవీకారులు రాజ్యమేలుతరు. లంచావతారులు పుట్టుకొస్తరు. రైతులను ఆగం చేస్తరు. అట్లాంటి కాంగ్రెస్ను ఎట్టిపరిస్థితిల్లో నమ్మేది లేదు.
– ఎం సంతప్రెడ్డి, కొత్తపల్లి
ధరణితో భూముల సమస్యలు తీరినయ్. కొత్తపాస్బుక్కులు రావడంతో పాటు రిజిస్ట్రేషన్ మండలంలనే అవుతున్నది. మునుపు భీమదేవరపల్లికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చి ఇక్కడ పట్వారీలకు ఆ కాగితాలు ఇచ్చి తిరిగేది. ఇప్పుడు అదేదీ లేదు. అన్నీ రిజిస్ట్రేషన్తోనే వస్తున్నయి. కాంగ్రెస్ భూమాత పెడుతామంటంది. మళ్లీ పాతపద్ధతి తేవాలని చూస్తంది. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదుగానీ, రైతులను మళ్లీ ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నది.
– కచ్చు రవి, రైతు, వెన్కేపల్లి(సైదాపూర్)
ధరణి రాకముందు నా పేరు మీద పట్టా అయినా భూమిని ఎకించడానికి కొన్ని రోజులు ఆఫీసర్ల సుట్టు తిరగాల్సి అచ్చింది. అదే మొన్న ధరణి అచ్చినంక పట్టా చేసుకున్న. వెంటనే ఆన్లైన్లో నా పేరు మీద భూమి కనిపించింది. పాత కాలానికి, ధరణి వచ్చినంక పరిస్థితి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. పట్టా ఆయిన వెంటనే రికార్డు మన పేరు మీద రావడం ఎంత అద్భుతం. ఇసొంటి పకడ్బందీ రికార్డులు నాకు తెలిసి దేశంలో ఎకడా లేవు. ఒకవేళ కొందరు అన్నట్టు ధరణి తీసేస్తే.. తీసేసేటోళ్లు మంచిగానే ఉంటరు. కానీ ప్రజలు ఆఫీసులో సుట్టూ తిరుగుతరు. నా భూమిని నేనెకడ ఉన్న గూడ ఇప్పుడు ఫోన్లో చూసుకుంటున్న. ఇటువంటి నమ్మకమైన ధరణి తీసేస్తానంటే ఎట్లా.
– వంగాల శ్రీనివాస్ రెడ్డి, రైతు, నుస్తులాపూర్ (తిమ్మాపూర్)
నాకు కొంత భూమి ఉంది.. దాంతోటి మా చిన్న బాపోళ్లది ఏడెకురాలు గుత్తకుజేత్త. మునుపు భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటె మేం హుజూరాబాద్ పోవాల్సి వచ్చేది.. ఇప్పుడు ఎమ్మార్వో ఆఫీసులనే చేస్తన్రు. అందరికీ అందుబాటులో ఉన్నది. పనులు కూడా తొందరగ అయితున్నయ్.. రైతులు ఇబ్బంది పడుతలేరు.. మునుపు మా ఊళ్లె బాల్రెడ్డి చిన్న కొడుకు భూమి రిజిస్ట్రేషన్కు సాక్షి సంతకానికి రమ్మంటె పోయిన.. అప్పుడు ఆ రైతు అరిగోస పడ్డడు.. వారం పది రోజులు ఆఫీసుల సుట్టూ తిరగడానికే పట్టింది.. భూమినివట్టి ఆఫీసులోళ్లు పైసలు వసూలు చేసిండ్రు.. ఇప్పుడు ధరణి వచ్చినంక ఏం తిప్పలు లేవు.
– తుమ్మలు కొమురెల్లి, రైతు, గద్దపాక(శంకరపట్నం)
కాంగ్రెసోళ్లు ఎవుసాన్ని డెవలప్ సేత్తమని రైతులను ఆగంపట్టిచ్చేలా ఉన్నరు. ఇప్పుడు అందరం మూడు ఎస్పర్ల మోటర్ వాడుతన్నం. లేకపోతే ఐదు ఎస్పర్ల మోటర్ వాడుతన్నం. కని రేవంత్ పదెస్పర్ల మోటర్తోని మొత్తం పారిచ్చుకోమంటండు. ఏమన్న రైతుల గురించి తెలుసో లేదో మరి ఆయనకు. పెద్ద మోటర్లు పెట్టుకుంటే డెవలప్ అవుడు అనుకుంటండో ఏందో. రైతులు ఇప్పుడిప్పుడే ఆలోసిస్తన్రు.
-గంకిడి సత్యనారాయణరెడ్డి, రైతు (తిమ్మాపూర్)
24 గంటల ఉచిత కరెంటుతో బంగారం లాంటి పంటలు పండిస్తున్నం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయం చేస్తున్నరు. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ నాయకులకు రైతుల పని, వారి అవసరాలు ఏం తెలుసు? అందుకే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటం.
– కొమ్మెర రాజిరెడ్డి, రైతు, గొల్లపల్లి(తిమ్మాపూర్ రూరల్)
కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామనుడు పద్ధతి కాదు. ధరణి వచ్చిన తర్వాతనే ఒకే దగ్గర రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతున్నయి. రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పినయ్. కేసీఆర్ సీఎం అయినంక రైతులకు అవస్థలు లేవు. వేరే సరారు వస్తే రైతుల కష్టాలు మళ్ళీ మొదలైతయ్. రైతులు బ్రోకర్లు, పట్వారీల వెంట తిరిగి లంచాలు ఇవ్వాల్సి వస్తది.
– పెసరి చిన్న ఎల్లయ్య, రైతు, (చిగురుమామిడి)