కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వంట గ్యాస్ కనెక్షన్లను తొందరగా అప్డేట్ చేసుకోవాలన్న ఆందోళనతో వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరు వరకే గడువు ఉందని పుకార్లు రావడంతో బారులు తీరి పడిగాపులుకాస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వినియోగదారులు ఈకేవైసీ చేసుకోవాలని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మరో పక్క ఆయా కంపెనీల ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని, అప్డేట్కు చివరి తేదీ అంటూ ఏమీ ఉండదని సూచిస్తున్నాయి.
వంట గ్యాస్ వినియోగదారులు తమ కనెక్షన్లను అప్డేట్ చేసుకోవాలని నిజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే, దీనికి ఎలాంటి చివరి తేదీ లేదు. కానీ, కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఈ నెల 31 వరకు చివరి తేదీ ఉన్నట్లు వినియోగదారుల సెల్ ఫోన్లకు మెస్సేజ్లు పంపుతున్నాయి. మరో పక్క సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈకేవైసీ చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 గ్యాస్ పంపిణీ చేస్తుందనే పుకార్లు కూడా పుట్టాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న వినియోగదారులు వీలైనంత తొందరగా తమ గ్యాస్ కనెక్షన్ల ఈకేవేసీ ద్వారా అప్డేట్ చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. నవంబర్ నెల నుంచే ఈ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ఈ నెలలో ఎక్కువ ప్రచారం జరిగింది. ఈకేవైసీ చేసుకుంటేనే రూ.500 గ్యాస్ పంపిణీ వర్తిస్తుందని పుకార్లు లేవడంతో వినియోగదారులు ఒక రకంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా వినియోగదారుల సెల్ ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తున్నాయి. అయితే, వీటిలో రూ.500ల గ్యాస్ ప్రస్తావన లేనప్పటికీ చాలా మంది వినియోగదారులు దాని కోసమే అన్నట్లుగా భావించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు.
ఈకేవైసీ తీసుకోవడం ఎందుకు?
నిజానికి ఈకేవైసీ అనేది రాష్ట్రంలో కొత్త ప్రభు త్వం రాకముందు నుంచే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు రూ.200 తగ్గించిన తర్వాతనే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్యాస్ కనెక్షన్లు ఎవరి పేరు మీద ఉంది. కనెక్షన్ పొందిన లబ్ధిదారులే గ్యాస్ వాడుతున్నారా, ఇతరులు ఎవరైనా వాడుతున్నారా, కనెక్షన్ పొందిన ప్రదేశంలోనే దానిని వాడుతున్నారా, ఇతర ఏ ప్రాంతానికికైనా తరలించారా? అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకునేందుకు బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆధార్ నంబర్లను ఏ విధంగానైతే అప్డేట్ చేసుకోవడం కోసం ఈకేవైసీ విధానాన్ని వినియోగించారో అదే విధంగా గ్యాస్ కనెక్షన్లను కూడా అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభు త్వం గ తంలోనే గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. దీంతో భారత్, ఇండెన్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు ఈ ప్రక్రియను గత నెలలోనే ప్రారంభించాయి. తమ పరిధిలోని వినియోగదారుల సెల్ ఫోన్లకు మెస్సేజీల ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నాయి. మంద కొడిగా అయినా కొంత మంది వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ను అప్డేట్ చేయించుకుంటు న్న సమయంలో ఈకేవైసీ చేయించుకుంటేనే రూ.500కే గ్యాస్ పంపిణీ చేస్తారని పుకార్లు పుట్టాయి.
ఉజ్వల కనెక్షన్లకు సబ్సిడీ వస్తుందా లేదా?
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తీసుకోవడంలో మరో కోణం కూడా కనిపిస్తోంది. గతంలో ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన వారిలో ఎంత మంది వాడుతున్నారు. వాడుతున్న వారికి కేంద్రం ఇస్తున్న రూ.300 సబ్సిడీ వస్తున్నదా లేదా? అనే విషయాలతోపాటు ఇంకా ఎంత మందికి గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉంటాయనే లెక్కలు కూడా ఈ ప్రక్రియ ద్వారా తేలే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారుల్లో ఎంత మంది ఉపయోగించుకుంటున్నారనే విషయం కూడా ఈ ప్రక్రియ ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.
చివరి తేదీ అంటూ ఏమీ లేదు
గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీ అంటూ ఏమీ లేదని, దీనికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. కేంద్రం కేవలం గ్యాస్ కంపెనీలకు మాత్రమే ఈ బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్రెడ్డి తెలిపారు. అయితే, జిల్లాలోని 21 ఏజెన్సీల్లో గత రెండు మూడు రోజులుగా ఈ ప్రక్రియ శర వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో 3,12,206 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కో ఏజెన్సీలో నాలుగైదు కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్లను ఈకేవైసీ చేయించుకోవాలంటే సంబంధిత గ్యాస్ కనెక్షన్ పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని వెంట తీసుకుని వెళ్లాలి. ఏజెన్సీలు ఏర్పాటు చేసిన కౌంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రలు వేయాలి. ఒకవేళ వేలి ముద్రలు రాకుంటే ఐరిస్ ద్వారా డాటా ఎంట్రీ పూర్తి చేస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పుకార్ల కారణంగా ఏజెన్సీల్లో తాకిడి పెరిగింది. దీంతో కొన్ని ఏజెన్సీలు వినియోగదారులకు టైం కేటాయిస్తూ టోకెన్లు కూడా ఇస్తున్నాయి. టైంకు వచ్చి ఈకేవైసీ చేయించుకుంటే సరిపోతుందని, చివరి తేదీ అంటూ ఏమీ లేదని ఒక పక్క గ్యాస్ ఏజెన్సీల డీలర్లు కూడా చెబుతున్నారు.