గొల్లపల్లి, జనవరి 28 : ఆయిల్పామ్ సాగు ఎప్పటికీ లాభదాయకమేనని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. శనివారం గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు ఓరుగంటి రమణారావు వ్యవసాయ క్షేత్రంలో జగిత్యాల జిల్లాలో తొలి పామాయిల్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాగువైపు మరలాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉద్యాన పంటైన పామాయిల్ సాగు రైతులకు ఎంతో లాభం తెస్తుందన్నారు. కొందరు ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేకనే రైతులను పామాయిల్ దిశగా మళ్లిస్తుందనడంలో వాస్తవం లేదన్నారు.
ఏటా నూనె గింజల పంటలకు డిమాండ్ పెరుగుతున్నదని, అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 57 శాతం ఆయిల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని, మనం పండించే దిగుబడి మనకే సరిపోదన్నారు. జగిత్యాల జిల్లాకు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గోల్డ్ డ్రాప్ ఆయిల్) కంపెనీని కేటాయించిందని, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి విత్తనాలు తెచ్చి 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో రైతులకు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు సహకార సంఘాల ద్వారా నాలుగేళ్ల మారిటోరియంపై రుణాలు అందిస్తామన్నారు. అందులో అంతర పంటల సాగుకు ఎకరాకు 50 వేల రుణాన్ని తక్కువ వడ్డీకి అందించనున్నట్లు చెప్పారు.
అనంతరం కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో మూడేళ్లలో 32,588 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. 2022-23లో 4300 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఇప్పటికే 3560 ఎకరాల్లో మొక్కలకు డీడీలు, 2100 ఎకరాలకు డ్రిప్ కోసం డీడీలు చెల్లించినట్లు వివరించారు. అనంతరం జిల్లా ఉద్యానశాఖ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగు చేసే రైతులు అంతర పంటల సాగుకు ఏటా 4200ల చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ రైతులు దొడ్డు రకం వరి పంటను మాని సన్న రకాలు, ఆయిల్పామ్తో పాటు సీతాఫలం, జామ వంటి పంటలను సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, సహకార సంఘం ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసుమన్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంపెల్లి హన్మాండ్లు, చందోలి ప్యాక్స్ అధ్యక్షుడు మాధవరావు, అబ్బాపూర్ సర్పంచ్ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.